Begin typing your search above and press return to search.

లోకేష్ గురించి మ‌ళ్లీ అదే మాట వినిపిస్తోంది

By:  Tupaki Desk   |   2 May 2016 12:56 PM GMT
లోకేష్ గురించి మ‌ళ్లీ అదే మాట వినిపిస్తోంది
X
తెలుగుదేశం పార్టీ అధినేత- ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ మంత్రి ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నారా? ఆయ‌న్ను కేబినెట్‌ లోకి తీసుకునేందుకు ఇపుడు బ‌య‌టి వ్య‌క్తుల నుంచి ఒత్తిడి వ‌స్తోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

ఈ సంవత్సరం కృష్ణా పుష్కరాల తర్వాత నారా లోకేష్‌ బాబు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి కావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొత్త ప్రచారం ఎత్తుకున్నాయి. ఆయనకు సమాచార సాంకేతిక శాఖ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-ఐటి)ను కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనాప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందే లక్ష్యంతో పలు కోణాల్లో పరిశీలించిన మీదట లోకేష్‌ ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతోపాటు ఆయనకు ఐటీ శాఖను ఇవ్వడం స‌రైంద‌ని భావిస్తున్న‌ట్లు చెప్తున్నారు. తన కుమారుడికి ఐటీ శాఖను కేటాయించడం ద్వారా ఏపీలో ఐటీని అభివృద్ధి పర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఐటి ఫ్రొఫెషనల్స్‌ - నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించడం ఒక లక్ష్యం.

వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ సంస్థ లోకేష్‌ కు ఐటి శాఖ కేటాయించాలని బాబుకు సూచించిందని, అందుకే సీఎం ఆ దిశగా లోచనలు సాగిస్తున్నారనే కొత్త చ‌ర్చ ప్రారంభం అయింది. ఐటీ అభివృద్ధికి అవసరమైన ఫైబర్‌ ఆప్టిక్‌ - బ్రాడ్‌ బ్యాండ్‌ లైన్లు తదితర మౌలిక సదుపాయాల పనుల్లో రిలయన్స్ ఏపీలో అధిక కాంట్రాక్టులు పొందిందని, తమ పనులు సులువుగా జరిగిపోవాలంటే లోకేష్‌ కు ఐటీ శాఖ కేటాయించాలని ఆ వ్యాపార సంస్థ సలహా ఇచ్చిందని చెబుతున్నారు. అంతే కాకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుమారుడు కేటీఆర్‌ కు ఐటి శాఖను కేటాయించారు. హైదరాబాద్‌ లో ఐటీ రంగంలో పెట్టుబడులపై ప్రధానంగా కేటీఆర్‌ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో లోకేష్ కూడా ఐటీ శాఖ కేటాయించాలని ఇప్ప‌టికే ప‌లు వ‌ర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా లోకేష్‌ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు - మంత్రులు బహిరంగంగా కోరుతూ చర్చను జోరుగా సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌ద‌వి వ‌ద్ద‌ని లోకేష్ చెప్పిన‌ప్ప‌టికీ ఆయ‌న కేంద్రంగా చ‌ర్చ జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది.