Begin typing your search above and press return to search.

చిల్లరకు నో చెబితే దేశద్రోహం కేసేనట

By:  Tupaki Desk   |   25 Sep 2016 9:58 AM GMT
చిల్లరకు నో చెబితే దేశద్రోహం కేసేనట
X
నిత్యం పలువురికి ఎదురయ్యే అనుభవం మీద ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లా కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆర్ బీఐ చట్టబద్ధంగా విడుదల చేసిన‌ నోట్లను కానీ.. చిల్లర నాణెల్ని కానీ తీసుకోవటానికి నిరాకరించే వారి విషయంలో తీవ్రమైన కేసు నమోదు చేయొచ్చంటూ తీర్పు చెప్పింది. చిల్లర నాణెల్ని తీసుకోవటానికి ఒప్పుకోని వ్యాపారులపై దేశద్రోహం కేసు నమోదు చేయొచ్చని కోర్టు అభిప్రాయ‌ప‌డింది.

నిత్యం పలువురు దుకాణదారులు కొన్ని చిల్లర నాణెల్ని.. ఐదు రూపాయిల నోట్లను తీసుకోవటానికి నిరాకరిస్తుంటారు. అదేమంటే.. అవి చెల్లవని.. అందుకే తమకు వద్దని చెబుతారు. ఇలాంటి పరిస్థితి మన దగ్గరే కానీ యూపీలో కూడా ఉంది. ఆ రాష్ట్రానికి చెందిన పుల్కిత్ శర్మ అనే వ్యక్తి బరేలీ లోని ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. ఏ దుకాణానికి వెళ్లినా... అత‌డు రూ.10 నాణేలు ఇస్తే షాపుల య‌జ‌మానులు తీసుకునేవారు కాదు. అయితే దుకార‌ణ‌దారులు మాత్రం చిల్ల‌ర ఇవ్వాల్సి వ‌స్తే... రూ.10 నాణేలు అత‌డికి ఇచ్చేశారు.

గడిచిన రెండు మూడు నెలలుగా ఇదే ప‌రిస్థితి ఎదుర‌వ‌డంతో అతని వద్ద ఈ నాణెలు చాలామేర ఉండిపోయాయి. ఈ నాణెలకు చట్టపరిమితి ఎక్కువ కాలం లేదని.. అవి చెల్లుబాటు కావన్న ఊహాగానాలు పెరిగిపోయాయి. ఇలాంటి విషయాలు వైరల్ కావటానికి సోషల్ మీడియా ఇప్పుడు అందరికి అందుబాటులో ఉన్న నేపథ్యంలో.. జిల్లా వ్యాప్తంగా ఈ వార్త హడావుడి చేయటం మొదలైంది. చివరకు ఈ సమాచారం జిల్లా న్యాయమూర్తి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన స్పందించారు. ఆర్ బీఐ విడుదల చేసిన పది రూపాయిల నాణెనికి చట్టబద్ధత ఉందని.. రిజర్వ్ బ్యాంకు ఆమోదించిన నాణెల్ని తీసుకోవటానికి నో చెబితే చట్ట ప్రకారం తప్పు చేసిన వారు అవుతారని.. ఇలాంటి వారి మీద దేశ ద్రోహం కేసు నమోదు చేయొచ్చని పేర్కొన్నారు. మీ దగ్గర ఎవరైనా చిల్లర నాణెలు.. ఐదు రూపాయిల నోటుకు నో చెబితే మరో ఆలోచన లేకుండా వారిపై ఫిర్యాదు చేయొచ్చన్నమాట.