Begin typing your search above and press return to search.

రావుల‌పాలెంలో రెడ్ ఎంఐ నోట్ 4 కాలిపోయింది

By:  Tupaki Desk   |   13 Aug 2017 12:34 PM GMT
రావుల‌పాలెంలో రెడ్ ఎంఐ నోట్ 4 కాలిపోయింది
X
కొంటాం బాబు అంటే.. అమ్మేవాడు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసే రోజులివి. అలాంటి రోజుల్లోనూ నేను ఫ‌లానా టైంలోనే అమ్ముతా? అప్ప‌టివ‌ర‌కూ వెయిట్ చేయాల‌న్న కండీష‌న్ పెట్ట‌ట‌మే కాదు.. నిమిషాలు మాత్ర‌మే అమ్ముతూ.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోన్ల‌కు పిచ్చ క్రేజ్ తెచ్చుకుంటున్న కంపెనీ ఏదైనా ఉందంటే అది చైనాకు చెందిన షియోమి కంపెనీకి చెందిన రెడ్ ఎంఐ ఫోన్లుగా చెప్పాలి.

వారంలో రెండు రోజుల పాటు ప‌రిమిత స‌మ‌యంలో మాత్ర‌మే ఆన్ లైన్లో అమ్ముతూ.. ఆఫ్ లైన్ లో కొనాలంటే కాస్త ఎక్కువ పెట్టి కొనే ఫోన్లు ఏమైనా ఉన్నాయంటే అది షియోమికి చెందిన‌వి మాత్ర‌మే ఉంటాయి.బ‌జారుకు వెళితే.. కుప్ప‌లు కుప్ప‌లుగా ఫోన్లు దొరికే ఇప్ప‌టి రోజుల్లో ఏ మాత్రం డిమాండ్ త‌గ్గ‌కుండా.. త‌న ఫోన్ల కోసం జ‌నాలు ఆన్ లైన్లో క్యూలో నిలుచునేలా చేస్తున్న ఈ కంపెనీకి చెందిన ఫోన్‌కు సంబంధించిన ఒక ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లా రావుల‌పాలెం గ్రామానికి చెందిన భావ‌న సూర్య‌కిర‌ణ్ కిళ్లీ షాపు న‌డుపుతుంటాడు. అత‌డికి రెడ్ ఎంఐ నోట్ 4 ఫోన్ ఉంది. ఆదివారం ఉద‌యం సెల్ ఫోన్ ను ప్యాంటు జేబులో పెట్టుకొని బైక్ మీద షాపుకు వెళుతున్న వేళ‌.. ఒంటికి ఏదో కాలిన‌ట్లుగా అనిపించి.. చ‌టుక్కున బండి ఆపేసి దిగాడు.

జేబులో నుంచి ఫోన్ తీసేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా కుద‌ర‌క‌పోవ‌టంతో.. అక్క‌డి స్థానికులు గుర్తించి వెంట‌నే నీళ్లు జ‌ల్లి మంట‌ల్ని ఆపేసి.. ఫోన్ కింద ప‌డేశారు. దీంతో.. కిర‌ణ్‌కు తొడ భాగంలో గాయాలు అయ్యాయి. తాను ఫోన్ కొని కేవ‌లం నెల మాత్ర‌మే అయ్యింద‌ని.. త‌న‌కింత న‌ష్టం క‌లిగించిన కంపెనీ మీద కోర్టులో కేసు వేస్తాన‌ని చెబుతున్నాడీ రావుల‌పాలెం కుర్రాడు. మ‌రి.. ఫ్యాంటు జేబులో పెట్టుకుంటే ఫోన్ ఎందుకు కాలిన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు ఇప్పుడు స‌మాధానం ల‌భించ‌లేదు. ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది.