Begin typing your search above and press return to search.

అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో!

By:  Tupaki Desk   |   11 July 2019 4:31 PM GMT
అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో!
X
సుప్రీం కోర్టు సూచన మేరకు ముంబయిలోని రినైజాన్స్‌ హోటల్‌ లో మకాం వేసిన కాంగ్రెస్‌ – జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలకు కర్ణాటక స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ గట్టి షాక్‌ ఇచ్చారు. రాజీనామాలు ఆమోదించడం ఇప్పటికిప్పుడు కాదని.. పరిశీలించాల్సి ఉందని తేల్చి చెప్పారు. ఈమేరకు ఆయన అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత మీడియా సమావేశంలో తెలిపారు. సుప్రీంకోర్టు సూచన మేరకు ముంబయిలో ఉన్న కాంగ్రెస్‌ – జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో బెంగళూరులోని హెచ్ ఏఎల్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య జీరో ట్రాఫిక్‌ నిర్వహించి విధానసౌధలోని స్పీకర్‌ చాంబర్‌ కు తరలించారు. సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ ను 11 మంది (ఎమ్మెల్యేలు భైరతి బసవరాజ్ - రమేశ్‌ జార్కిహోళి - మహేశ్‌ కుమటళ్లి - మునిరత్న - నారాయణేగౌడ - హెచ్‌.విశ్వనాథ్ - ఎస్‌ టీ సోమశేఖర్ - శివరాం హెబ్బార్ - బీసీ పాటిల్ - గోపాలయ్య - ప్రతాప్‌ గౌడపాటిల్‌) కలిశారు. సమయం మించిపోతుందనే ఉద్దేశంతో అసంతృప్త ఎమ్మెల్యేలు హడావుడిగా స్పీకర్‌ చాంబర్‌కు పరుగులు పెట్టడం విశేషం. అసంతృప్త ఎమ్మెల్యేలతో స్పీకర్‌ సంభాషణ మొత్తాన్ని వీడియో చిత్రీకరించారు. స్పీకర్‌తో భేటీ అనంతరం అసంతృప్త ఎమ్మెల్యేలు తిరిగి భారీ బందోబస్తు మధ్య హెచ్ ఏఎల్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు.

‘అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోలేను. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా తీర్మానిస్తాం. స్పీకర్‌గా నా బాధ్యతలను నిర్వర్తిస్తాను. ఎవరిని ఉంచాలి.. ఎవరిని పంపించాలనేది నా చేతుల్లో లేదు. ఏ ఒక్క పార్టీకి ఒత్తాసు పలకాల్సిన అవసరం రాలేదు. ఇప్పటి వరకు రాజీనామా చేసిన 16 మందిలో 8 రాజీనామా పత్రాలు తిరస్కరించాను. మిగతా వారి రాజీనామా పత్రాల పరిశీలించి తుది నిర్ణయం ప్రకటిస్తాం. కాగా ఈనెల 6వ తేదీన పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా ఇచ్చారు. అయితే ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నేను ఆఫీసులోనే ఉన్నారు. అప్పటి వరకు ఏ ఒక్క ఎమ్మెల్యే రాలేదు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వచ్చి స్పీకర్‌ లేరని వెళ్లి గవర్నర్‌ ను కలిసి రాజీనామా పత్రాలు సమర్పించారు. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా సమర్పించినట్లు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈక్రమంలో వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి’ అని స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ చెప్పారు. ఈసందర్భంగా చేతిరాతతో రాసిన రాజీనామా పత్రాలను మరోసారి సమర్పించారు. స్పీకర్‌ కార్యాలయంలోనే ఖాళీ కాగితాలను తీసుకుని రాసి ఇచ్చారు. అయితే తమ రాజీనామాల వెనుక ఎవరి ఒత్తిడి లేదని పేర్కొన్నారు.

కర్నాటకలోని అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే రాజీనామా లేఖ సమర్పించారో వారు.. గురువారం సాయంత్రం 6 గంటల లోపు స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ ముందు హాజరు కావాలి. ఈమేరకు ప్రభుత్వం - స్పీకర్‌ కు నోటీసులు జారీ చేశారు. ఈనేపథ్యంలో స్పీకర్‌ తో భేటీ అయ్యేందుకు బెంగళూరుకు వచ్చే అసంతృప్త ఎమ్మెల్యేలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పోలీసులకు అప్పజెప్పారు.