Begin typing your search above and press return to search.

వైసీపీలోకి వలసలు... దేనికి సంకేతం

By:  Tupaki Desk   |   20 Feb 2019 5:28 AM GMT
వైసీపీలోకి వలసలు... దేనికి సంకేతం
X
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వలసల పర్వం సాగుతోంది. ఎక్కడైన - ఏ రాష్ట్రంలోనైన ప్రతిపక్షాలకు చెందిన వారు అధికార పార్టీ వైపు వెళ్లడం - ఆ పార్టీలో చేరాలనుకోవడం సహజం. దీనికి కారణం అధికారం చేతిలో ఉంటుంది కాబట్టి ఎన్నికలలో విజయం సాధించడం సాధ్యమని రాజకీయ నాయకుల ఆలోచన. ఇది చాలా సార్లు నిజమైంది కూడా. అధికార పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారో - ఇతర కారణాలతో ఇబ్బందులు పడుతున్నవారో ప్రతిపక్షంలో చేరుతారు. అదికూడా చాలా తక్కువగానే ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్ష వైఎస్‌ ఆర్ పార్టీలోకి కోకొల్లలుగా నాయకులు చేరుతున్నారు. పోనీ అని వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నవారంతా చిన్నచితక నాయకులు కాదు. ఈ మధ్యనే లోక్‌ సభ సభ్యులు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్‌ ఆర్ పార్టీలో చేరారు. అలాగే అధికార ఎమ్మెల్యే ఒకడు ప్రతిపక్ష వైఎస్‌ ఆర్‌ లో చేరారు. వీరితో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా వైఎస్‌ ఆర్ కాంగ్రెస్‌ లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వలసల పర్వం ప్రారంభమయ్యింది. శ్రీకాకుళం మాజీ ఎంపీ కిళ్లీ క్రుపారాణి వైెఎస్‌ ఆర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు - ఆయన కుమారుడు కూడా వైఎస్‌ ఆర్ కాంగ్రెస్‌ లో చేరిపోయారు. నెల్లూరు - ప్రకాశం - తూర్పుగోదావరి - పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు - ప్రజాప్రతినిధులు వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్దం పుచ్చుకునేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున జగన్‌ ను కలిసారు. ఆయన గుంటూరు నుంచి లోక్‌ సభకు పోటీ చేస్తారని - ఆ విషయం మాట్లాడేందుకే జగన్‌ ను కలిసారని వార్తలు వచ్చాయి. అయితే నాగార్జున మాత్రం వాటిని ఖండించకపోయినా - తాను జగన్‌ కు మిత్రుడినని అందుకే ఆయనను కలిసేందుకు వచ్చానని ప్రకటించారు. అయినా రాజకీయ పార్టీ నాయకులతో ఎన్నాడు సన్నిహితంగా లేని అక్కినేని కుటుంబం హఠాత్తుగా జగన్‌ కలవడం వెనుక రాజకీయ కోణం ఉందని అంటున్నారు. ఇలా వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇతర రాజకీయ పార్టీలనుంచి - సీనిరంగం నుంచి కూడా ప్రముఖులు వచ్చి చేరడంతో పార్టీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.