Begin typing your search above and press return to search.

ఇదేదో ముందే చేసి ఉండొచ్చుగా కేసీఆర్

By:  Tupaki Desk   |   29 July 2016 7:39 AM GMT
ఇదేదో ముందే చేసి ఉండొచ్చుగా కేసీఆర్
X
ఈ మధ్యన ప్రముఖ మీడియా సంస్థలు పెడుతున్న హెడ్డింగులు చూస్తే మెంటలెక్కిపోవాల్సిందే. విషయాన్ని ట్విస్ట్ చేసేయటం.. అదేదో గొప్ప విషయంగా ప్రొజెక్ట్ చేయటం.. తీరా విషయంలోకి వెళ్లాక అందులో పస లేకపోవటం ఈ మధ్యన తరచూ కనిపిస్తోంది. ఏదో ఊరూ..పేరూ పెద్దగా తెలియని కొన్ని మీడియాల వారు కక్కుర్తి పడ్డారనే వారి బాధను అర్థం చేసుకోవచ్చు. కానీ.. పేరు ప్రఖ్యాతులు పుష్కలంగా ఉండి కూడా పడుతున్న కక్కుర్తి చూస్తే నోట మాట రాదు. ఇవాల్టి దినపత్రికలు చూసిన వారి దృష్టిని ఒక వార్త విపరీతంగా ఆకర్షిస్తుంది.

అదేమంటే.. తెలంగాణలో మొబైల్ ఫోన్ల ధరలు మరింత చౌక అయిపోయానన్న హెడ్డింగ్ తో వచ్చిన వార్త. వావ్.. తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఎంత మమకారమో.? పన్ను పోటు నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఎంత మంచినిర్ణయం తీసుకుందో అంటూ ఆసక్తిగా వార్తలోకి వెళ్లిన వారికి కాసింత షాక్ తగలాల్సిందే. ఎందుకంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో పలు రాష్ట్రాలు అంటే తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు మొబైల్ అమ్మకాల మీద పన్నును 5 శాతం మాత్రమే వసూలు చేస్తున్నాయి. కానీ.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం 14.5శాతం పన్ను పీకుతున్నాయి.

అయితే.. ఇంత భారీ ఎత్తున వసూలు చేస్తున్న పన్ను దెబ్బకు వ్యాపారులు దగ్గర నుంచి వినియోగదారుల వరకూ ప్రభుత్వానికి పన్ను పెంపు ప్రయోజనం లేకుండా వ్యవహరించటంతో.. దీని వల్ల జరుగుతున్న నష్టాన్ని కేసీఆర్ సర్కారు గుర్తించింది. లోకమంతా ఒక దారిన పోతుంటే.. తాను మాత్రం మరో దిక్కున పోవాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుందన్న విషయాన్న అధికారుల ఫీడ్ బ్యాక్ తో తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. పన్ను తగ్గింపుపై నిర్ణయం తీసుకునే తప్పనిసరి పరిస్థితి.

అయితే.. ఈ సమాచారాన్ని వీలైనంత బాగా రిఫైన్ చేసి.. చెప్పిన మీడియా సంస్థలు.. తెలంగాణలో మొబైల్ ఫోన్లు కారుచౌక అన్నట్లుగా హెడ్డింగులు పెట్టటం చూస్తే షాక్ తినాల్సిందే. ఇప్పటివరకూ వసూలు చేస్తున్న 14.5 శాతాన్ని 5 శాతానికి తగ్గించటం ద్వారా తమిళనాడు.. ఆంధ్రాలో వసూలు చేస్తున్న పన్నుకు సమానంగా తెలంగాణ రాష్ట్రం చేరిందే తప్పించి.. సగటుజీవికి ఎలాంటి అదనపు ప్రయోజనం కలగలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ.. అందుకు భిన్నంగా ఏదో భారీ లాభం కలుగుతుందన్న భ్రమకు గురయ్యేలా బడా మీడియా సంస్థలు పెట్టిన హెడ్డింగులు చూస్తే.. ఓరి నాయనో అనుకోకుండా ఉండలేని పరిస్థితి.