Begin typing your search above and press return to search.

‘‘సురేశ్ ప్రభు’’ ఐడియా ఎవరిది?

By:  Tupaki Desk   |   30 May 2016 11:30 AM GMT
‘‘సురేశ్ ప్రభు’’ ఐడియా ఎవరిది?
X
పేరుకు మిత్రపక్షమే అయినా.. నిత్యం సూటిపోటీ మాటలు అనిపించుకోవటం తెలుగుదేశం పార్టీకే చెల్లుతుందేమో. ఒక రకంగా చూస్తే.. ఏపీ అధికారపక్షాన్ని తమ మాటలతో ఇమేజ్ డ్యామేజ్ చేసింది జగన్ పార్టీ నేతల కంటే కూడా బీజేపీ నేతలుగానే చెప్పాలి. మిత్రపక్షంగా ఉంటూనే ఏపీ సర్కారు ఏమీ చేయటం లేదన్న వాదనను తరచూ వినిపించటంలోనూ.. కేంద్రం పడేసిన చిల్లర పైసలకు లెక్కలు చెప్పాలంటూ నిలదీయటం ఏపీ బీజేపీ నేతకే చెల్లుతుంది. ఇది చాలదన్నట్లు ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేకహోదా విషయంలో చేయిచ్చిన కమలనాథులతో ఉన్న రిలేషన్ కు బాబును కటీఫ్ చెప్పాలంటూ పలువురు చెబుతున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఆ పని చేయలేనన్నట్లుగా బాబు కామ్ గా ఉంటున్నారు.

న్యాయబద్ధంగా ఏపీకి రావాల్సిన డిమాండ్లను తీర్చని మోడీ సర్కారు.. ఏపీకి అధికారపక్షం కోటా కింద రాజ్యసభకు వెళ్లే ముగ్గురు సభ్యులలో ఒకరిని తనకు కేటాయించాలని కోరటం చూస్తే అలాంటివి ప్రతిపాదనలు మోడీకి మాత్రమే చెల్లుతాయని చెప్పాలి. ఇచ్చేది లేకున్నా తమకు కావాల్సినవి తీసుకునే విషయంలో ఎలాంటి మొహమాటాలకు తావివ్వకుండా తీసుకునే మోడీ.. తాజాగా సురేశ్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉండటం.. దానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు.

ఇంతమంది నేతలు ఉన్నా.. వారెవరిని కాదని సురేశ్ ప్రభును ఏపి కోటా కింద కేటాయించటం ఎవరి ఐడియా అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎందుకంటే.. మిగిలిన ఎన్ని శాఖలు ఉన్నా.. రైల్వే శాఖకు ఉండే ఇమేజ్ వేరు. అలాంటి ఇమేజ్ ఉన్న మంత్రి ఏపీ కోటాలో ఎన్నిక కావటం అంటే.. అది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంగా మారుతుంది. అదే జరిగితే.. ఏపీ మీద రైల్వేశాఖామంత్రి ఫోకస్ ఎంతోకొంత పెరగటం ఖాయం. చూస్తూ.. చూస్తూ ఏపీ కోటా కింద ఒక రైల్వే మంత్రి రాజ్యసభకు వెళుతున్నారంటే.. సీమాంధ్రప్రజలు కూడా కన్వీన్స్ అయ్యే పరిస్థితి. మరో నేత విషయంలో అయితే ఎంతోకొంత వ్యతిరేకత ఉండేదేమో కానీ.. సరేశ్ ప్రభు వ్యక్తిత్వం.. ఆయన పనితీరుపై తరచూ మీడియాలో వచ్చే వార్తల పుణ్యమా అని.. ఆయన రాకకు స్వాగతం చెప్పటమే తప్ప లేదు.

నిజానికి.. సురేశ్ ప్రభు కాకుండా మరే నేతను అయినా ఏపీ బరి నుంచి దింపిన పక్షంలో బాబు సర్కారుపై విమర్శల జడివాన కురిసేది. అందుకు భిన్నమైన వాతావరణం ఏర్పడటానికి కారణం సురేశ్ ప్రభుగా చెప్పాలి. ఏపీ కోటా కింద సురేశ్ ప్రభును ఎంపిక చేసింది ప్రధాని మోడీ అని కొందరు అంటుంటే.. అన్ని ఆలోచించి చంద్రబాబు నాయుడే ఆ ప్రతిపాదన చేసి ఉంటారన్నది మరో టాక్. మోడీకి సలహా ఇచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు లేని నేపథ్యంలో.. సురేశ్ ప్రభును ఏపీ నుంచి ఎంపిక చేయాలన్నది కచ్ఛితంగా మోడీ అండ్ కో ఐడియానే అన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.