Begin typing your search above and press return to search.

కొణతాల కోసం ప్రత్యేక ముహూర్తం?

By:  Tupaki Desk   |   29 April 2016 12:26 PM GMT
కొణతాల కోసం ప్రత్యేక ముహూర్తం?
X
తెలుగుదేశం పార్టీలో చేరేందుకు స‌ర్వం సిద్ధం చేసుకున్న వైసీపీ మాజీ నేత‌ - మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సైకిలెక్క‌డం ఎందుకు ఆల‌స్యం అయింది? ఆయ‌న కీలక అనుచరులైన‌ పాడేరు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు - పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు ప‌సుపు కండువా క‌ప్పుకొన్న‌ప్ప‌టికీ కొణ‌తాల ఆగిపోయారంటే పార్టీ మార‌డం వాయిదా ప‌డిన‌ట్లేనా? లేదా త్వ‌ర‌లో ప్ర‌త్యేక ముహుర్తం ఉంటుందా? అంటే తెలుగుదేశం శ్రేణులు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇస్తున్నాయి.

కొణాతాల‌తో పాటే పాడేరు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు- పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు ఒకేసారి చేరాల‌ని భావించారు. అయితే ఈ చేరిక‌లో జాప్యం జరిగింది. వ్యూహం ప్రకారమే ముందుగా తన‌ అనుచరులను పంపించి.. ఆ తరువాత ప్రత్యేక ముహూర్తంలో కొణతాల పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కొంత సమయం పట్టవచ్చని చెబుతున్నారు. దాదాపు వచ్చే ఎన్నికల వరకు ఆయన తటస్థంగానే ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.

బాబ్జీ - కిడారితోపాటు కొణతాలను కూడా పార్టీలో చేర్చుకోవాలని తెదేపా అధిష్ఠానం యోచించినా, ఆయన ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు. దీంతో సర్వేశ్వరరావు - గండి బాబ్జీ చేరికకు మాత్రం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. తగిన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కొణతాల తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల వద్ద అన్నట్లు తెలిసింది. దీంతో సర్వేశ్వరరావు - బాబ్జీల చేరికకు సిద్ధ‌మైపోయారు. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి అయ్యన్నపాత్రుడు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆరు నెలల క్రితమే ముఖ్యమంత్రిని కొణతాల కలిసే ఏర్పాట్లు చేసిన విషయం విదితమే. ఆయన రాకపై అప్పట్లోనే తెదేపాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం, మరో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు ఎమ్మెల్యేలు సమావేశమై వ్యతిరేకించడం చోటుచేసుకున్నాయి. దీంతో రామకృష్ణ తన నిర్ణయాన్ని ప్రకటించకుండా వాయిదా వేసుకుంటూ వచ్చారు.