Begin typing your search above and press return to search.

కోడెల టీడీపీని వీడాలనుకున్నారా..అస‌లు గొడ‌వ అక్క‌డేనా..!

By:  Tupaki Desk   |   17 Sep 2019 7:53 AM GMT
కోడెల టీడీపీని వీడాలనుకున్నారా..అస‌లు గొడ‌వ అక్క‌డేనా..!
X
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం ఏదైనా ఉందంటే అది...టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ ఆత్మహత్య. ఆయన సాధారణంగా చనిపోతే ఎలాంటి చర్చ ఉండేది కాదేమో...కానీ అనేక రాజకీయ విమర్శల మధ్య ఆయన బలవన్మరణానికి పాల్పడటంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. టీడీపీ నేతలు ఏమో వైసీపీ రాజకీయ కక్షలకు బలైపోయారని అంటుంటే..వైసీపీ వాళ్లెమో...కోడెల కుమారుడు, కూతురు పెట్టిన టార్చర్ వల్లే చనిపోయారని ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణల మధ్య తాజాగా కోడెల గురించి మరో వార్త హల్చల్ చేస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కోడెల మీద గానీ, ఆయన కుటుంబం మీద ఎలాంటి ఆరోపణలు, కేసులు నమోదయ్యాయో అందరికీ తెలుసు. చివరికి అసెంబ్లీ ఫర్నిచర్‌ని కుమారుడు షో రూమ్‌లో వినియోగించడంపై కూడా కోడెల మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఇన్ని ఒత్తిళ్ళ మధ్య ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.

అందులో భాగంగానే ఇటీవల ఆయన బీజేపీ నేతలు గరికిపాటి రామ్మోహన్ రావు - సుజనా చౌదరీలతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక ఈ విషయంలోనే కుమారుడు శివరాంతో కోడెలకు మనస్పర్థలు చోటు చేసుకున్నాయి అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా కోడెల చనిపోయిన వెంటనే ఆయనకు వరుసకు బావమరిది అయ్యే వైసీపీ నేత కంచేటి సాయి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

శివరామ్ తనను మానసికంగా వేధిస్తున్నాడని కోడెల తనతో చెప్పారన్నారు. కోడెల మరణంపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సత్తెనపల్లి డీఎస్పీకి క్రోసూరు మండలం పీసపాడుకి చెందిన కంచేటి సాయి ఫిర్యాదు కూడా చేశారు. మరి చూడాలి కోడెల ఆత్మహత్యకు దారితీసిన కారణాలెంటో భవిష్యత్ లో పోలీసులే తేల్చాలి.