Begin typing your search above and press return to search.

కేసీఆర్ రెండు చోట్ల పోటీ లెక్క‌వెనుక కార‌ణం ఇదా?

By:  Tupaki Desk   |   19 Oct 2018 4:19 PM GMT
కేసీఆర్ రెండు చోట్ల పోటీ లెక్క‌వెనుక కార‌ణం ఇదా?
X
`టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - అపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు రెండో నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు`. ఈ వార్త గ‌త కొద్దిరోజుల‌గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఓవైపు ముంద‌స్తుకు పార్టీ సిద్ధ‌మ‌వుతుంటే...మ‌రోవైపు ఆ పార్టీలో నిర‌స‌న‌లు తారాస్థాయికి చేరుతున్న క్ర‌మంలో ఈ వార్త హాట్ టాపిక్‌ గా మారింది. అస‌లు ఎందుకు కేసీఆర్ ఈ ఆలోచ‌న చేస్తున్నార‌నే సందేహం స‌హ‌జంగా తెర‌మీద‌కు వ‌స్తోంది. దీనికి ప‌లు ర‌కాల విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి..

వివిధ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి పోటీచేయడం అప్ప ట్లో తమ అదృష్టంగా భావించిన స్థానిక ప్రజలు, ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నారని సమాచారం. అంతేగాక అయన నియోజకవర్గానికి రావడం మూలంగా స్థానికులు ఇబ్బంది పడ్డారని తెలిసింది. అయన ఫాంహౌజ్‌ లో ఉన్న రోజుల్లో రోడ్లు మూసివేయడం, అనేక సందర్భాల్లో అంతరాయం కలగడం, ఇబ్బందులు తలెత్తడం జరిగిందనే భావనలో స్థానికులు ఉన్నట్టు రిపోర్ట్‌ లు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. గత ఏడాది కాలంగా సర్వేల మీద సర్వేలు చేయిస్తున్న టీఆర్ ఎస్‌ అధినేత - ఇప్పుడు గజ్వేల్‌ తోపాటు మరో సురక్షిత నియోజకవర్గం వైపు దృష్టిపెట్టారని ప్రగతి భవన్‌ వర్గాల నుంచి వినికిడి. గజ్వేల్‌ లోనూ ఎప్పటికప్పుడు సర్వేలు చేయించినప్పటికీ - స్థానిక ప్రజలు గుంభనంగా ఉంటున్నారనే ప్రచారం తెలంగాణ లో జరుగుతోంది. ఇప్పుడు తమ అభిప్రాయాలనూ - మనసులోని మాటలను బయటకు చెబితే నష్టమని భావిస్తున్నట్టు తెలిసింది. ఈవీఎంలో ఓటు మీటను నొక్కడం ద్వారా కచ్చితమైన తీర్పును ఇచ్చేందుకు స్థానిక ప్రజలు నిర్ణయించుకున్నారని నిఘా వర్గాలు అంటున్నాయి. గజ్వేల్‌ నుంచి సీఎం ప్రాతినిథ్యం వహించినా - ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు అంటున్నవారు లేకపోలేదు. ఇందు కోసం గజ్వేల్‌ అభివృద్ధి అథారిటీ(గడ)ని ఏర్పాటు చేసినా అభివృద్ధి మాత్రం సీఎం స్థాయిలో చోటుచేసుకోలేదని నిఘావర్గాలకు స్థానిక ప్రజల నుంచి అందిన సమాచారాన్ని తమ నివేదికల్లో పేర్కొన్నట్టు తెలిసింది. ఎర్రవెల్లిలోని తన 70 ఎకరాల ఫాంహౌజ్‌ కోసమే కొంతమేర అభివృద్ధి పేర హడావుడి చేశారనీ - అంతే తప్ప మరే ఇతర అభివృద్ధి పనులూ అనుకు న్నంత జరగలేదనే అభిప్రాయంతో గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజలు ఉన్న ట్టు విప‌క్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికే కొందరు గజ్వేల్‌ ద్వితీయ శ్రేణి నాయకత్వంతోపాటు మరికొందరు ప్రతిపక్ష పార్టీల్లో చేరి తిరిగి టీఆర్ ఎస్‌ లో చేరారు.

మ‌రోవైపు ప‌లు అంశాలు సైతం తెర‌మీద‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇంటెలిజెన్స్‌ నివేదిక నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సైతం పునరాలోచనలో పడ్డట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. కేవలం నిఘా వర్గాల నివేదికలపైనే ఆధారపడకుండా, ప్రయివేటు సంస్థలతోనూ సర్వేలు చేయించినట్టుగా ప్రగతిభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో గజ్వేల్‌తోపాటు మేడ్చల్‌ నియోజకవర్గంలోనూ పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డికి ఇప్ప టికే టికెట్‌ నిరాకరించారు. అక్కడ తాను పోటీచేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయమై కూడా ప్రయివేటు సంస్థలతో కొన్ని ప్రశ్నలు రూపొందించి సర్వే చేయించారనే ప్రచారం కూడా ఉంది. ఇందులోనూ వ‌చ్చిన వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గం మార్పు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్తున్నారు.