Begin typing your search above and press return to search.

బాహ‌బ‌లి గురించి జానా ఎందుకు మాట్లాడారంటే

By:  Tupaki Desk   |   19 March 2017 10:09 AM GMT
బాహ‌బ‌లి గురించి జానా ఎందుకు మాట్లాడారంటే
X
సీఎల్పీ నేత జానారెడ్డి చిత్ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కుంటున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ నేత‌ల్లో ధైర్యం నింపే రీతిలో మాట్లాడ‌లేక పోవ‌డంతో... జానారెడ్డి త‌మ‌కు భ‌రోసా ఇవ్వ‌డం లేదనే అప‌ప్ర‌ద‌ను ఎదుర్కున్నారు. అయితే ఇపుడు దానికి పూర్తి భిన్నంగా ఆయ‌న‌పై కామెంట్లు వ‌స్తున్నాయి. జానారెడ్డి ఎందుకు ఇలా మాట్లాడారు అనే ప్ర‌శ్న సైతం అదే శ్రేణులు నుంచి వినిపిస్తోంది. ఇదంతా కేవ‌లం ఒకే ఒక్క‌ మాట వ‌ల్ల‌. అదే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించేందుకు బాహుబలి వస్తున్నాడంటూ జానారెడ్డి చెప్ప‌డం.

అసెంబ్లీ సమావేశాల నేప‌థ్యంలో సీఎల్పీ కార్యాలయంలో జానారెడ్డి మీడియాతో ఇష్టా గోష్టిగా మాట్లాడుతూ మమ్మల్ని గెలిపించేందుకు బాహుబలి వస్తాడని వ్యాఖ్యానించారు. దీంతో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరా బాహుబలి? ఎలా ఉంటాడు? ఎక్కడి నుంచి వస్తున్నాడు? టీఆర్‌ ఎస్‌ పార్టీ నుంచి ఏమైనా వస్తున్నారా? అన్న ఆసక్తికరమైన చర్చ కొనసాగింది. ఇతర పార్టీల నుంచి వస్తారా? లేక సినిమా పరిశ్రమ నుంచి ఎవరైనా వచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారా? అన్న కోణంలోనూ మరొ చర్చ జరుగుతున్నది. అదే స‌మ‌యంలో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో గెలిపించే నాయకుడు లేడని, అందుకే ఆ పార్టీ బాహుబలి అవసరాన్ని కోరుతుందని కొంత మంది చెబుతూ త‌మ పార్టీ ప‌రిస్థితిని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న నాయకులెవరికీ పార్టీని గెలిపించే సీన్‌ లేదా? పార్టీ నేతల అనుయాయులు ప్రశ్నిస్తున్నారు. లేకపోతే ప్రస్తుత అధ్యక్షుడిపై జానారెడ్డి నమ్మకం కోల్పోయి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. బాహుబలి ఎవరనేది ఎన్నిక‌ల రోజుల్లో బయటకొస్తోందని కొంత మంది ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

గత ఎన్నికల్లో ఎటువంటి ఆశలు పెట్టుకుని పార్టీ చేజేతులా ఓడించారని అప్పట్లో విమర్శలొచ్చాయి. పార్టీ అంతర్గత చర్చల్లో విశ్లేషించుకున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవికి కూడా అందులో కొంతమంది సీరియస్‌ గా ప్రయత్నం చేస్తున్న వారే. పార్టీ అధ్యక్షుడైతే ముఖ్యమంత్రి కావొచ్చనే ఆలోచనతో కొంత మంది ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు సీఎం అభ్యర్థి అనేది తర్వాతనే అధిష్టానం ఖరారు చేస్తుందని అందుకు తొందరెందుకని మరికొంత మంది నేతలు భావిస్తున్నారు. ఈ రకమైన పరిణామాల నేపథ్యంలో ఈ నాయకులను కాదని పార్టీ బాహుబలిని కోరుకుందా? అని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి - అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క - ఆ పార్టీ సీనియర్‌ నేతలు డీకే అరుణ - కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - ఎస్‌ జైపాల్‌ రెడ్డి - గీతా రెడ్డి - షబ్బీర్‌ అలీ - దామెదర రాజనర్సింహ్మ - సబితా ఇంద్రారెడ్డి - కోమటిరెడ్డి బ్రదర్స్‌ తదితర నేతలంతా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న వారే. పంజాబ్ ఎన్నికల్లో ప్రముఖ క్రికెటర్‌ సిద్దూ బాహుబలి తరహాలో ఆ పార్టీని విజయతీరాలకు నడిపించినట్టుగానే...యువతపై ఎంతో ప్రభావాన్ని చూపిన హైదరాబాదీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ ఇక్కడ బాహుబలి కానున్నారా? అని కొంద‌రు విశ్లేషిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/