Begin typing your search above and press return to search.

జుకర్‌ బర్గ్‌ కు బీజేపీ వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   21 March 2018 4:34 PM GMT
జుకర్‌ బర్గ్‌ కు బీజేపీ వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఇదేనా?
X
సోషల్ మీడియాను - అందులోనూ ఫేస్‌ బుక్‌ ను ఎంత వాడుకోవాలో అంత వాడుకున్న పార్టీ బీజేపీ. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించడంలో ఫేస్ బుక్ పాత్ర తక్కువేమీ కాదు. ఫేస్ బుక్ ఇందుకోసం ప్రత్యేకంగా ఏమీ చేయకపోవచ్చు కానీ, ఫేస్ బుక్ మాధ్యమంగా ప్రజలను చేరుకోవడంలో మోదీ టీం సూపర్ సక్సెస్ అయింది. కానీ.. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు బీజేపీ ఫేస్ బుక్ పై మండిపడుతోంది. అంతేకాదు.. జుకర్ బర్గ్‌ కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. భారత్‌లో ఎన్నికలను ప్రభావితం చేయాలని ఏమాత్రం ప్రయత్నం చేసినా కేసులు పెడతామని హెచ్చరించారు. అమెరికా ఎన్నికల్లో 5 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్ల డాటా దుర్వినియోగం అయిందన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఈ వార్నింగులు ఇచ్చింది. అయితే... బీజేపీ నేరుగా జుకర్ బర్గ్‌ కు ఇంత తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేయడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు.

అమెరికాఅధ్యక్ష ఎన్నికలు.. బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ ఫేస్‌ బుక్ సమాచారాన్ని వినియోగించుకుని ప్రభావితం చేసిందన్న ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. బీజేపీ హెచ్చరికలూ ఈ నేపథ్యంలోనే వచ్చాయి. అయితే.. మరింత లోతుగా పరిశీలిస్తే ఇక్కడ రాజకీయ సంబంధాలూ బీజేపీని బయపెడుతున్నాయని అర్థమవుతోంది. కేంబ్రిడ్జి అనలిటికాలో ఎస్‌ సీఎల్ ఇండియా అనే సంస్థ భాగస్వామి. ఇది భారతీయ సంస్థ. ఆ సంస్థ వెబ్‌సైట్ ప్రకారం 2014 ఎన్నికల్లో ఎస్‌సీఎల్ సంస్థ బీజేపీ - కాంగ్రెస్ పార్టీలకు సోషల్ మీడియా కన్సల్టెంటుగా పనిచేసినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ మిషన్ 272 ప్లస్ టార్గె్ సాధన కోసం పనిచేసినట్లు ఎస్‌సీఎల్ వెబ్ సైట్లో క్లెయిం చేసుకుంది.

భారత్‌ లో ఎస్‌ సీఎల్ ఇండియా సంస్థలో కేంబ్రిడ్జి ఎనలిటికా అంతర్భాగం. లండన్‌ లోని ఎస్‌ సీఎల్ గ్రూపు - ఓవ్లెనో బిజినెస్ ఇంటలిజెన్స్ (ఓబీఐ) ప్రైవేట్ లిమిటెడ్‌ ల జాయింట్ వెంచర్. భారత్‌ లోని పది రాష్ట్రాల్లో 300 మంది శాశ్వత ఉద్యోగులతో పాటు 1,400 మందికి పైగా కన్సల్టింగ్ సిబ్బంది అందులో పనిచేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.... ఎస్ సీ ఎల్ సంస్థ అధినేత ఎవరన్నది ఇక్కడ కీలకం. ఈ సంస్థ అధినేత అమ్రిష్ త్యాగి. జేడీయూ కీలక నేత కేసీ త్యాగి కుమారుడు ఈయన. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తాను కీలక పాత్ర పోషించానన్న విషయాన్ని త్యాగి గతంలో బహిరంగంగానే చెప్పారు.

కాగా... అమెరికా ఎన్నికల మాదిరిగా 2014 ఎన్నికల గుట్టుమట్లు పడినా పడొచ్చన్న ఉద్దేశంతోనే బీజేపీ ముందు జాగ్రత్తగా ఈ సంస్థకు దూరంగా ఉంటోందని... ముందస్తుగా ఏకంగా జుకర్‌ బర్గుకే హెచ్చరికలు చేసి సచ్ఛీలత ప్రదర్శించుకునే ప్రయత్నాల్లో ఉందన్న విమర్శలొస్తున్నాయి. ఎన్నికల అక్రమాలు ఏవైనా బయటపడినా అది ఫేస్ బుక్‌పైకి నెట్టేసే ప్రయత్నంలో భాగమే ఈ కోపమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.