Begin typing your search above and press return to search.

బాబుకు అస‌మ్మ‌తి రుచిచూపిస్తున్న గంటా

By:  Tupaki Desk   |   24 Jun 2018 5:30 PM GMT
బాబుకు అస‌మ్మ‌తి రుచిచూపిస్తున్న గంటా
X
తెలుగుదేశం పార్టీలోని ప‌రిణామాల ప‌ట్ల అసంతృప్తితో ర‌గిలిపోతున్న రాష్ట్ర విద్యా శాఖామంత్రి మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు కొత్త ఎజెండాను సిద్ధం చేస్తున్నారా? పార్టీలోని అసంతృప్తులంద‌రినీ ఆయ‌న ఏకం చేయ‌ద‌లిచారా? ఇందులో భాగంగా సీనియ‌ర్ నేత‌తో ఈ సిరీస్ మొదలుపెట్టారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. గత వారం పదిరోజులుగా పార్టీకి - పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్ర‌బాబు విశాఖ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అల‌క వీడిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇది తాత్కాలిక‌మేన‌ని భావించే ప‌రిస్థితులు తెర‌మీద‌కు వ‌చ్చాయి. శనివారం సాయంత్రం విక్రమ సింహపురి యూనివర్శిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరు వచ్చారు. అయితే ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ ప్ర‌త్యేక భేటీ నిర్వ‌హించారు.

అధికారిక కార్య‌క్ర‌మంలో భాగంగా నెల్లూరు వ‌చ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో భేటీ కావడం ప్రధాన చర్చానీయాంశంగా మారింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చిన మంత్రి గంటా నెల్లూరు నగరంలోని ఆనం నివాసానికి స్వయంగా వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. పైకి మాత్రం మర్యాదపూర్వకంగానే కలిశామని చెబుతున్నప్పటికీ అంతర్గతంగా వీరిరువురి మధ్య అనేక రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన మంత్రులు - ఇతర టీడీపీ సీనియర్‌ నాయకులు ఎవరూ లేకుండా ఆయన ఒంటరిగానే వెళ్ల‌డం ఇందుకు బ‌లం చేకూరుస్తోంది. ఆనం నివాసానికి వెళ్లి ఇంత ర‌హ‌స్యంగా ఎందుకు గంటా స‌మావేశం కావాల్సి వ‌చ్చింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

ఇదిలాఉండ‌గా...ఆనం రాజ‌కీయ భ‌విష్య‌త్ వెతుక్కుంటున్న స‌మ‌యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంటోంది. 2016 జనవరిలో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఆనం సోదరులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలోనే ఆనం సోదరులిరువురికీ పార్టీలో కీలక పదవులతో పాటు ఎమ్మెల్సీ లాంటి అధికారిక పదవులు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అవి ఆచరణ అమలుకు నోచుకోకపోవడం - పార్టీలో ఆనం కుటుంబానికి తగిన ప్రాధాన్యతను కూడా ఇవ్వకపోవడంతో గత నాలుగు నెలలుగా ఆనం రామనారాయణరెడ్డి పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఆనం సోదరుడు వివేకానందరెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదితమే. ఈ పరిణామాలు అనంతరం కార్యకర్తల మనోభావాలకనుగుణంగా త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని రామనారాయణరెడ్డి గతంలో వెల్లడించారు.ఈ నేపథ్యంలోనే తన అనుచరులతో కూడా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి పార్టీలో తమకు జరిగిన అవమానాలను వివరిస్తూ వస్తున్నారు. ఇంత‌టి కీల‌క స‌మ‌యంలో గంటా ఒంటరిగా క‌ల‌వ‌డం అంటే..టీడీపీలోని అసంతృప్తులంద‌రినీ ఏకం చేసే ఎత్తుగ‌డ‌ను ర‌చిస్తున్నారా? అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.