Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎంపీల రాజీనామా ఆమోదానికి ఆల‌స్యం ఎందుకు?

By:  Tupaki Desk   |   6 Jun 2018 9:32 AM GMT
జ‌గ‌న్ ఎంపీల రాజీనామా ఆమోదానికి ఆల‌స్యం ఎందుకు?
X
ప్ర‌త్యేక హోదా అంశంపై మొద‌ట్నించి ఒకే తీరులో డిమాండ్ చేస్తున్న పార్టీ ఏపీలో ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. గ‌డిచిన నాలుగేళ్ల కాలంలో ప్ర‌త్యేక హోదా కోసం విప‌క్ష అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లు నిర‌స‌న‌లు.. దీక్షా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. హోదా సాధ‌న కోసం కేంద్ర ప్ర‌భుత్వం మీద ఒత్తిడిని పెంచేందుకు వీలుగా త‌మ పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించారు పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అయితే.. జ‌గ‌న్ ఎంపీల రాజీనామా లేఖ‌ల్ని ఆమోదించ‌కుండా త‌న వ‌ద్ద‌నే నిలిపివేసి ఈ రోజు ఆమోదించారు లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌.

ఇప్ప‌టికున్న రూల్స్ ప్ర‌కారం.. ఏడాది.. అంత‌కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్న ఎంపీ సీట్ల‌కు ఉప ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌రు. అయితే.. ఈ రూల్ కు అప్లై కాని రీతిలో ముందే జ‌గ‌న్ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. వారి రాజీనామాల్ని లోక్ స‌భ స్పీక‌ర్ ఆమోదిస్తే.. ఉప ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉండేది. అయితే.. వీరి రాజీనామాల్ని ఆమోదించే విష‌యంలో పైస్థాయిలో భారీ క‌స‌ర‌త్తు జ‌రిగింద‌ని చెబుతున్నారు.

రాజీనామా చేసే ఎంపీలు.. ఉప ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్ని సొంతం చేసుకోవ‌టం ఖాయ‌మ‌ని బ‌లంగా విశ్వ‌సిస్తోంది. ఇదే న‌మ్మ‌కంతో పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నారు. అయితే.. ఏపీలో ఉప ఎన్నిక‌ల విష‌యంలో బీజేపీ అగ్ర నాయ‌క‌త్వానికి కొన్ని అంశాలు ఉన్నాయ‌ని.. ఈ కార‌ణంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాల‌కు ఆమోద‌ముద్ర ప‌డ‌కుండా అడ్డుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఉప ఎన్నిక‌లు వ‌స్తే.. బీజేపీకి త‌గ్గిన ఓట్ల బ్యాంక్ తో పాటు.. ప్ర‌త్యేక హోదా మీద ఆంధ్రోళ్ల‌కు ప్ర‌ధాని మోడీ మొద‌లు కొని పార్టీ అధినేత అమిత్ షాతో పాటు.. ప‌లువురు నేత‌లు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది క‌మ‌ల‌నాథుల‌కు క‌ఠిన ప‌రీక్ష‌గా మారుతుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కెలుక్కొని మ‌రీ లేని స‌మ‌స్య‌ల్ని మీద వేసుకోవ‌టం కంటే కూడా.. కామ్ గా ఉండ‌టం మంచిద‌న్న అభిప్రాయంతోనే ఉన్న‌ట్లు చెబుతున్నారు.

మ‌రోవైపు ఈ అంశంపై మ‌రో ఆస‌క్తిక‌ర క‌థ‌నం ప్ర‌ముఖంగా చెబుతున్నారు. హోదా కోసం ప‌ద‌వుల్ని త్యాగం చేసిన జ‌గ‌న్ పార్టీ ఎంపీలు మూకుమ్మ‌డిగా రాజీనామాలు చేయ‌టం.. వాటిని ఓకే అన్న త‌ర్వాత ఉప ఎన్నిక‌ల‌కు తెర తీస్తుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తాము రాజీనామా చేసిన నియోజ‌క‌వ‌ర్గాల నుంచి బ‌రిలోకి దిగితే భారీ మెజార్టీతో గెలుపొంద‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం జ‌గ‌న్ కు ఉంది. ఇదే విష‌యం మీద ప‌లుమార్లు పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ న‌డిచింది.

అయితే.. ప్ర‌త్య‌ర్థికి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వకూడ‌ద‌న్న ఉద్దేశంతోనే ఉప ఎన్నిక‌ల‌కు మోడీ స‌ర్కారు మోకాలు అడ్డిన‌ట్లుగా చెబుతున్నారు. ఏదైనా తేడా జ‌రిగి.. ఒక్క స్థానంలో ఫ‌లితం తేడా కొడితే మిగిలిన ఓట్ల మీద ప్ర‌భావం ఎంతోకొంత ఉండ‌టం ఖాయం. అదే జ‌రిగితే త‌మ పార్టీకి మేలు జ‌రుగుతుంద‌న్న‌ ఉద్దేశంతో జ‌గ‌న్ హోదాపై వెన‌క్కి త‌గ్గేది లేద‌న్న సంకేతాల్ని చాటి చెప్పార‌నుకోవాలి. అయితే.. బ‌రిలోకి దిగినా ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌లేని బీజేపీ.. ఏపీలో ఉప ఎన్నికు జ‌రిగితే త‌మ పార్టీ అడ్ర‌స్ లేక‌పోవ‌టం నిజ‌మైతే.. అది బీజేపీకి శాపంగా మార‌టం ఖాయం. అదే జ‌రిగితే.. ఇప్ప‌టికున్న ఇమేజ్ మొత్తం పోయి డ్యామేజ్ వ‌స్తుంది. ఈ కార‌ణంతోనే జ‌గ‌న్ పార్టీ ఎంపీల రాజీనామా లేఖ‌ల్ని గ‌తంలోనే ఇచ్చేసినా.. వాటిని త‌మ ద‌గ్గ‌రే అడ్డుకోవ‌టం ద్వారా మోడీషాలు కోరుకున్న‌దే జ‌రుగుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.