Begin typing your search above and press return to search.

ఇందుకే దామోదర భార్య బీజేపీలో చేరిందా?

By:  Tupaki Desk   |   11 Oct 2018 1:01 PM GMT
ఇందుకే దామోదర భార్య బీజేపీలో చేరిందా?
X
ముంద‌స్తు ఎన్నిక‌లు పార్టీలు - నేత‌ల మ‌ధ్య చిచ్చు పెట్ట‌డ‌మే కాదు...నాయ‌కుల కుటుంబాల్లో కూడా చిచ్చుపెట్టింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది!కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఇంట్లో చోటుచేసుకున్న ప‌రిణామ‌మే ఇందుకు తార్కాణంగా కొంద‌రు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ గా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి.. ఇవాళ బీజేపీలో చేరారు. పద్మినీ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. కాషాయం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు భారీ షాక్ అని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అదే స‌మ‌యంలో దామోద‌ర‌ ఇంట్లో సీట్ల పంచాయితీ బహిర్గతమైందని పేర్కొంటున్నారు.

సీట్ల పంచాయితే ప‌ద్మిని రెడ్డి చేరిక‌కు కార‌ణ‌మ‌ని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఒక కుటుంబం నుంచి ఒకరికే సీటు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించిన విషయం విదితమే. అయితే రాజనర్సింహతో పాటు ఆమె భార్య పద్మినీరెడ్డికి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించడంతో.. పద్మినీ రెడ్డి బీజేపీలో చేరారని వార్తలు వస్తున్నాయి. అయితే, వరుస అసమ్మతులతో కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో పడిపోయిందని చ‌ర్చించుకుంటున్నారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంపై నమ్మకంతోనే పద్మినీ రెడ్డి బీజేపీలో చేరారని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు లక్ష్మణ్ - ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి మురళీధర్‌ రావు తెలిపారు.

పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గత కొంతకాలంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న పద్మినీ రెడ్డి.. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక పద్మినీరెడ్డి బీజేపీలో చేరారని తెలియడంతో.. దామోదర రాజనర్సింహ బిత్తరపోయారు. గజ్వేల్‌ లో తన ఎన్నికల ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం. దామోదర రాజనర్సింహ సొంత ఇంట్లోనే వేరు కుంపటి మొదలవడంతో.. ఆయన ఇరకాటంలో పడ్డారు. పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడంతో.. కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పుకోలేని స్థితిలో రాజనర్సింహ ఉన్నట్లు సమాచారం. అయితే దామోదర రాజనర్సింహ, పద్మినీ రెడ్డి మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్తున్నారు.