Begin typing your search above and press return to search.

ఇప్పుడు అందరి నోటా రూ.55 కోట్ల పెళ్లి మాటే

By:  Tupaki Desk   |   26 Nov 2015 6:28 AM GMT
ఇప్పుడు అందరి నోటా రూ.55 కోట్ల పెళ్లి మాటే
X
కేరళలో జరుగుతున్న ఓ వివాహ వేడుక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేరళకు చెందిన ఎన్నారై పారిశ్రామికవేత్త (రవి పిళ్లై) తన కుమార్తె పెళ్లి కోసం ఏకంగా రూ.55కోట్లు ఖర్చు పెట్టటమే కారణం. దాదాపు 80వేల మంది ఉద్యోగులున్న ఆర్పీ గ్రూప్ యజమాని అయిన రవి పిళ్లై తన కుమార్తె పెళ్లిని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. పెళ్లికి ప్రధాన ఆకర్షణగా పెళ్లి మండపాన్ని చెబుతున్నారు. బాహుబలి సెట్టింగ్ తరహాలో వేస్తున్న పెళ్లి మండపం కోసమే దాదాపు రూ.20కోట్లు ఖర్చు చేయటం విశేషం. మండపం కోసమే ఇంత భారీగా ఖర్చు చేస్తుంటే.. మిగిలిన ఏర్పాట్లు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు.

గల్ఫ్ లోని పలు దేశాల్లో స్థిరాస్థి.. మౌలిక సదుపాయాలు.. నిర్మాణ రంగ వ్యాపారాల్ని నిర్వహించే రవి పిళ్లై.. కేరళ ఎన్నారైలలో అత్యధిక ధనవంతుడిగా పేరుంది. రవిపిళ్లై కుమార్తె డాక్టర్ అరతీని కొచ్చికి చెందిన డాక్టర్ అదిత్య విష్ణుతో ఈ రోజు పెళ్లి చేస్తున్నారు. ఈ వివాహాం కోసం ప్రపంచ వ్యాప్తంగా 42 దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. అంతేకాదు.. ఈ పెళ్లి కోసం పలు అరబ్ రాజవంశీకులు కేరళ రానున్నారు. ప్రభుత్వాధినేతలు.. పారిశ్రామికవేత్తలు.. సెలబ్రిటీలు.. సినిమా రంగానికి చెందిన వారు హాజరు కానున్నారు. వీఐపీల్ని తరలించేందుకు తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో రెండు ఛార్టర్ ఫ్లైట్లు సిద్ధం చేశారు.

భారీగా సాగుతున్న ఈ పెళ్లికి మలయాల నటులు ఇచ్చే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. ఈ వేడుకల కోసం 250 మంది పోలీసులు.. 350 మంది ప్రైవేటు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అధికారికంగానే రూ.55కోట్ల ఖర్చు అని చెబుతున్న ఈ పెళ్లికి సంబంధించిన విశేషాలు ఇంకెన్ని బయటకు వస్తాయో..?