Begin typing your search above and press return to search.

ఢిల్లీ రాజ‌కీయ నేత‌ల‌కు ఆ యావే ఎక్కువా?

By:  Tupaki Desk   |   24 Feb 2017 9:12 AM GMT
ఢిల్లీ రాజ‌కీయ నేత‌ల‌కు ఆ యావే ఎక్కువా?
X
నిజ‌మేనండోయ్‌... ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికైన అన్ని పార్టీల ఎమ్మెల్యేల‌కు ఇటీవ‌లి కాలంలో ఆ యావ త‌ప్ప మ‌రింకేం క‌నిపించ‌డం లేదేమో. ఎందుకంటే... ఒక పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై రేప్ కేసు న‌మోదైతే... ఆ మ‌రునాడే మ‌రో పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై రేప్ కేసు బుక్కైపోతోంది. వెర‌సి పార్టీల ప్ర‌మేయం లేకుండా అన్ని పార్టీల‌కు చెందిన ఢిల్లీ ఎమ్మెల్యేలు అత్యాచారం కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఈ కేసుల్లో ఎంత మేర వాస్తవం ఉందో తెలియ‌దు కానీ... అన్ని పార్టీలు కూడా ఈ కేసుల‌తో త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. ఇప్ప‌టికే అక్క‌డ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ మంత్రితో పాటు మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. కేవ‌లం ఈ ఆరోప‌ణ‌ల‌తోనే ఆ పార్టీకి చెందిన ఇద్ద‌రు ముగ్గురు నేత‌లు పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యారు.

ఇక ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష పార్టీ హోదాలో ఉన్న బీజేపీకి కూడా తాజాగా ఇదే త‌ల‌నొప్పి స్టార్టైపోయింది. ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విజయ్ జోలీ ఓ మహిళపై అత్యాచారం చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని సాకేత్ నియోజకవ‌ర్గ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత‌ విజయ్ జోలీ తనను గురుగామ్ లోని అప్పాఘర్ రిసార్టుకు తీసుకువెళ్లి అక్కడ పానీయంలో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం జరిపాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్ 376, 328, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు బీజేపీ మహిళా విభాగానికి చెందిన ఓ మహిళ తనను రిసార్టులో కలిసి రూ.5లక్షలు ఇవ్వాలని కోరిందని, లేకుంటే అత్యాచారం కేసు పెడతానంటూ తనను బెదిరించిందని సదరు మాజీ ఎమ్మెల్యే విజయ్ ఖిడ్కీ దౌలా పోలీసులకు తిరిగి ఫిర్యాదు చేశారు. విజయ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను డబ్బు ఇవ్వనందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్ఠను దెబ్బ తీసిందని విజయ్ ఆరోపించారు. ఈ రెండు కేసులపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని గురుగ్రామ్ పోలీసు కమిషనర్ సందీప్ ఖైర్వార్ వివరించారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/