Begin typing your search above and press return to search.

మంత్రి ఇంట్లో మాజీ ప‌నోడికి కోట్ల కాంట్రాక్ట్

By:  Tupaki Desk   |   28 May 2017 9:56 AM GMT
మంత్రి ఇంట్లో మాజీ ప‌నోడికి కోట్ల కాంట్రాక్ట్
X
దేశంలో స్కాంల‌కు కొద‌వ‌లేదు. అయితే.. అధికారంలోకి వ‌చ్చిన నెల రోజుల్లోనే భారీ కుంభ‌కోణం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న స‌ర్కారుకు స‌రికొత్త రికార్డు సృష్టిస్తోంది పంజాబ్ రాష్ట్ర అధికార‌ప‌క్షం. మొన్నీమ‌ధ్య‌న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తిన్న కాంగ్రెస్‌ ను.. పంజాబీయులు అంత‌గా ఎందుకు ఆద‌రించిన‌ట్లు? అన్న డౌట్ రావొచ్చు. అప్ప‌టికే శిరోమ‌ణి అకాలీద‌ళ్‌.. బీజేపీ నేతృత్వంలోని మిత్ర‌ప‌క్షం ప‌ట్ల విసిగిపోయిన వారు.. మార్పు కోసం కాంగ్రెస్‌ కు ప‌వ‌ర్ ఇచ్చారు.

దీంతో.. అమ‌రీంద‌ర్ సింగ్ నేతృత్వంలో కొత్త స‌ర్కారును ఏర్పాటు చేశారు. తాజాగా అమ‌రీంద‌ర్ స‌ర్కారు పెద్ద ఎత్తున ఇసుక మైనింగ్ లైసెన్స్‌ ల‌ను జారీ చేసేందుకు వేలం నిర్వ‌హించారు. ఇది బంప‌ర్ హిట్ అయ్యింది. గ‌త ఏడాది ఇసుక త‌వ్వ‌కాల‌తో పోలిస్తే.. 20 రెట్లు అధికంగా వెయ్యి కోట్ల వ‌ర‌కూ ఆదాయం వ‌చ్చేలా వేలం నిర్వ‌హించారు.

వేలంపాట‌లో లైసెన్స్‌ల‌ను సొంతం చేసుకున్న వారిలో విద్యుత్ శాఖ మంత్రి రానా గుర్జీత్ సింగ్ తో సంబంధం ఉన్న న‌లుగురికి కీల‌క గ‌నులు ద‌క్క‌టం సంచ‌ల‌నంగా మారింది. కోట్ల రూపాయిల విలువైన కాంట్రాక్టు పొందిన వారిలో.. మంత్రిగారింట్లో ప‌ని చేసిన మాజీ ప‌నోడికి కూడా కోట్ల రూపాయిల కాంట్రాక్టు ల‌భించ‌టం వివాదంగా మారింది.

మంత్రి గుర్జీత్ ఇంట్లో ప‌ని చేసిన మానేసిన‌.. మాజీ ప‌నోడు అమిత్ బ‌హ‌దూర్‌కు న‌వాన్ ష‌హ‌ర్ జిల్లాలో రూ.26.5 కోట్ల విలువైన మైనింగ్ గ‌నులు ద‌క్కాయి. కోట్లాది రూపాయిల కాంట్రాక్టు పొందిన ఈ ప‌నోడి వార్షిక ఆదాయాన్ని చూస్తే 2014-15లో రూ.75,390 ఉంటే.. 2015-16 నాటికి రూ.92,679 మాత్ర‌మే. మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ ఏప్రిల్ ఒక‌టి నాటికి ఇత‌గాడి బ్యాంకు బ్యాలెన్స్ కేవ‌లం రూ.4840 మాత్ర‌మే. మ‌రి.. ఇలాంటి వ్య‌క్తికి ఏకంగా రూ.26.5 కోట్ల విలువైన మైనింగ్ గ‌నులు ద‌క్క‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసినంత మాత్రాన త‌మ మీద ఆరోప‌ణ‌లు ఎలా చేస్తార‌ని మంత్రి గుర్జీత్ ప్ర‌శ్నిస్తుంటే.. తాజాగా మైనింగ్ లైసెన్స్ లు పొందిన వారిలో ఎక్కువ మంది మంత్రుల‌కు ద‌గ్గ‌రి వారుగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇంటి ద‌గ్గ‌ర ప‌ని చేసి మానేసిన మాజీ ప‌నోళ్ల‌కు కోట్లాది రూపాయిల ప‌నుల్ని అప్ప‌గిస్తున్న పంజాబ్ అధికార‌ప‌క్ష వైఖ‌రి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/