Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై రామోజీ గుస్సా!!

By:  Tupaki Desk   |   18 July 2018 6:41 AM GMT
చంద్రబాబుపై రామోజీ గుస్సా!!
X
ఏపీ పాలిటిక్సులో రీసెంటుగా ఒక అనూహ్యమైన భేటీ జరిగింది. అది ఉండవల్లి అరుణ్ కుమార్ - చంద్రబాబుల భేటీ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పార్లమెంటులో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న విషయంలో ఉండవల్లి ఇచ్చిన సలహాలను ఈ రోజు నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ ఎంపీలు అమలు చేయనున్నారు. అంటే... ఉండవల్లి ఇప్పుడు చంద్రబాబుకు సలహాదారుగా మారారన్న మాట. దీన్ని రాజకీయంగా చూస్తే - ఇది చంద్రబాబుకు లాభం కలిగిస్తుందా నష్టం కలిగిస్తుందా అని విశ్లేషించుకుంటే.... పవన్ కల్యాణ్ జనసేనతో ఇటీవల ఉండవల్లి సంబంధాలు.. అంతకుముందు కాంగ్రెస్ లో సోనియా వద్ద ఆయనకున్న పట్టు... ఒకప్పుడు చంద్రబాబుతో బద్ధ విరోధం - ఇప్పుడు చంద్రబాబుకే సలహాలు.. కేంద్రంతో చంద్రబాబుకు పూర్తిగా బెడిసికొట్టిన సంబంధాలు.. ఇలా అనేకానేక కోణాల్లో చర్చించుకోవాల్సి ఉంటుంది. కానీ... ఉండవల్లి - చంద్రబాబు కాంబినేషన్ చంద్రబాబుకు ఎంత భారీ నష్టం కలిగించబోతోందన్నది చూస్తే సింగిల్ పాయింట్ సమాధానం ఒకటి లభిస్తోంది. అది... తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీకి అనధికారిక గొంతుగా ఉన్న ఈనాడు పత్రిక మద్దతు.. చంద్రబాబుకు ఈనాడు అధినేత - ఆయన రాజగురువు రామోజీ మద్దతు ఇకపై అంతకుముందున్న స్థాయిలో ఉండవనేదే ఆ సమాధానం.

ఉండవల్లి - చంద్రబాబు దోస్తీతో రామోజీకి వచ్చిన నష్టమేంటి.. ఆయనకు ఎందుకంత కోపమనేది తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు, రామోజీకి మధ్య జరిగిన పోరులో ఉండవల్లి పాత్ర.. మార్గదర్శి చిట్స్ విషయంలో రామోజీని ఉండవల్లి ఉక్కిరిబిక్కిరి చేసిన తీరు అందరికి తెలిసిందే. అందుకే ఉండవల్లి అంటే రామోజీ ఉలికి ఉలికి పడతారు. ఉండవల్లి వార్తలు ఈనాడు పత్రికలో కనిపించవు. అలాంటిది తన బద్ధ శత్రువును తన శిష్యుడు చంద్రబాబు ఇప్పుడు గురువుగా స్వీకరించడం రామోజీకి సుతారమూ నచ్చదు.

మరోవైపు రామోజీ ఇప్పటికే చంద్రబాబుకు ఇచ్చే ప్రయారిటీకి సమానమైన ప్రయారిటీని మోదీకి - బీజేపీకి ఇస్తున్నారు. మొన్న మోదీ దూతగా అమిత్ షా ప్రత్యేకంగా వచ్చి కలిసి నాలుగేళ్ల బీజేపీ పాలనలో సాధించి‌న విజయాలను ఆయనకు వివరించడమూ ఇక్కడ ప్రస్తావనార్హమే. ఇక ఇంకో విషయం ఏంటంటే... జగన్‌ తో రామోజీకి గతంలో ఉన్న వైరాలు దాదాపుగా సమసిపోవడం.. ఆయనకు కూడా గతం కంటే మెరుగైన కవరేజి ఇస్తుండడం.. అన్నిటికీ మించి ప్రజల నాడి పసిగట్టడంలో సిద్ధహస్తుడైన రామోజీ వచ్చే ఎన్నికల్లో జనం జగన్‌ కు అనుకూలంగా ఉన్నారన్న సత్యాన్ని ఇప్పటికే గుర్తించారన్నది ఈనాడు వర్గాల మాట. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఇలా తన విరోధిని అక్కున చేర్చుకోవడంతో రామోజీ మండిపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఉండవల్లి -చంద్రబాబుల భేటీ తరువాత రామోజీ ఫిలింసిటీలో ఈనాడు పెద్దలంతా సమావేశమయ్యారని.. చంద్రబాబుకు - టీడీపికి ఇచ్చే కవరేజి విషయంలో గతంలో ఉన్నట్లు ఇకపై ఉండాల్సిన అవసరం లేదని నిర్ణయించారని టాక్.

తాజా పరిణామాలతో టీడీపీ నేతల్లో ఆందోళన కనిపిస్తోందని సమాచారం. నియోజకవర్గాల స్థాయి నుంచి తమకు వెన్నుదన్నుగా ఉండే ఈనాడు మద్దతు పోతే ఎన్నికల్లో గెలుపు కష్టమేనని నేతలు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. అలాగే.. రాష్ట్రస్థాయిలో ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి ఈనాడు పత్రిక వేసే ప్రత్యేక అనుబంధాలు ప్రతి ఎన్నికల్లో టీడీపీకి ఎంతో మేలు చేస్తుంటాయి. ఈసారి ఆ అనుబంధాల్లోనూ వ్యూహం మారొచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఉండవల్లితో కలిసి చంద్రబాబు పెద్ద తప్పు చేశారని టీడీపీ నేతల నుంచి వినిపిస్తోంది.