Begin typing your search above and press return to search.

రాష్ర్టపతి పీఠంపై భూమిపుత్రుడు

By:  Tupaki Desk   |   20 July 2017 5:00 PM GMT
రాష్ర్టపతి పీఠంపై భూమిపుత్రుడు
X
భారతదేశ 14వ రాష్ఱ్టపతిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 25న బాధ్యతలు చేపట్టనున్నారు. కోవింద్ అభ్యర్థిత్వం అనూహ్యమైనా... ఆయన విజయం మాత్రం ఊహించనిదే. దళిత రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన దేశ అత్యున్నత పీఠం అధిరోహించడం వరకు ఆయన ప్రస్థానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే.

ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌ దేహాత్‌ జిల్లా దేరాపూర్‌ తాలూకా పారాంఖ్‌ గ్రామంలో 1945 అక్టోబర్‌ 1న దళిత కుటుంబంలో జన్మించిన కోవింద్ ఐఏఎస్ అధికారి కావాలనుకుని న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. అనంతరం రాజకీయాల్లో చేరి అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. మితభాషి - మృదు స్వభావి అయినప్పటికీ కార్యనిర్వాహణలో మాత్రం ఆయనకు అత్యంత సమర్థుడిగా పేరుంది.

కాన్పూర్‌ వర్సిటీ నుంచి బీకాం - ఎల్‌ ఎల్‌ బీ చదివిన ఆయన 1971లో న్యాయవాదిగా స్థిరపడ్డారు. 197-79 మధ్య ఢిల్లీ హైకోర్టు - సుప్రీంకోర్టుల్లో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో మూడో యత్నంలో ఉత్తీర్ణుడైన ఆయన ఐఏఎస్‌ రాకపోవడంతో న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు. 1977 నుంచి కొంతకాలం జనతా పార్టీకి చెందిన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ కి ఆర్థిక శాఖకు సం బంధించి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 198-93 మధ్య సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కాన్సుల్‌గా పనిచేశారు. కోవింద్‌ 1986లో డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగల్‌ ఎయిడ్‌ బ్యూరో జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు.

ఆలిండియా కోలీ సమాజ్‌కు నాయకత్వం వహించారు. తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు 1997లో చేసిన ఆందోళనలో పాలుపంచుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యమున్న కోవింద్‌ బీజేపీకి అత్యంత విధేయుడు. అదేసమయంలో ఆయన హిందుత్వ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కుల, మతాల కంటే బడుగు వర్గాలు సాధికారత రాజకీయాలపైనే దృష్టి పెట్టారు.

* కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సన్నిహితుడైన ఆయన తొలిసారి 1991 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీటు ఘాటంపూర్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు.

* 1994, 2006లో బీజేపీ తరఫున రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 12 ఏళ్లు ఎంపీగా పనిచేసి మరుసటి ఏడాది 2007లో తన సొంత జిల్లాలోని భోగినీపూర్‌ స్థానం నుంచి యూపీ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు.

* ఆ తర్వాత ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు.

*యూపీ బీజేపీ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన కోవింద్‌ 1998-2002 మధ్య బీజేపీ దళిత మోర్చా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ/ఎస్టీ, సామాజిక సాధికారత కమిటీ సహా ఐదు పార్లమెంటరీ కమిటీల్లో ఉన్నారు.

* 2002లో ఐరాసకు భారత బృందం సభ్యునిగా వెళ్లారు.

* కోవింద్‌ బీజేపీ జాతీయ ప్రతినిధిగా పనిచేసినా ప్రచారానికి దూరంగా ఉన్నారు. 2014లో బీజేపీ అధికారం చేపట్టాక 2015లో కోవింద్‌ను బిహార్‌ గవర్నర్‌గా నియమించారు.