Begin typing your search above and press return to search.

చిదంబరం నోట ఇందిర.. రాజీవ్ తప్పుల మాట

By:  Tupaki Desk   |   29 Nov 2015 4:14 AM GMT
చిదంబరం నోట ఇందిర.. రాజీవ్ తప్పుల మాట
X
గాంధీ కుటుంబానికి అపర విధేయుడిగా పేరొందిన చిదంబరం తంబి నోట చిత్రమైన మాటలు వచ్చేశాయి. గాంధీ కుటుంబం అధికారంలో ఉన్న ప్రతిసారీ.. అత్యున్నత పదవుల్ని చేపట్టిన చిదంబరానికి.. ప్రధానమంత్రి పదవిని అలంకరించాలన్న ఆలోచన ఉందని చెబుతుంటారు. అలాంటి ఆయన.. సార్వత్రిక ఎన్నికల తర్వాత తగిలిన ఓటమి షాక్ తో ఆయన పెద్దగా కనిపించటం లేదు. యూపీఏ 1.. యూపీఏ 2 ప్రభుత్వాలలో కీలక భూమిక పోషించిన చిదంబరం గత కొద్దికాలంగా వార్తల్లో పెద్దగా కనిపించటం లేదు.

తాజాగా ఆయన నోటి వెంట గాంధీ కుటుంబాల మీద ఆసక్తికర విమర్శలు చేశారు. టైమ్స్ లిటరరీ ఫెస్టివల్ కు అటెండ్ అయిన చిదంబరం ఇందిరా గాంధీ.. రాజీవ్ గాంధీలు చేసిన తప్పుల గురించి ప్రస్తావించారు. దేశంలో అత్యయిక పరిస్థితి విధించటం ద్వారా ఇందిరా గాంధీ తప్పు చేశారని.. ఆ తప్పు గురించి ఒప్పుకున్నారని.. ఆ తర్వాతే ఆమెను దేశ ప్రజలు అంగీకరించారని చెప్పిన చిదంబరం నోటి వెంట.. రాజీవ్ చేసిన తప్పు గురించి ప్రస్తావించారు.

దాదాపుగా 27 ఏళ్ల క్రితం (1988)లో సల్మాన్ రష్ధీ రాసిన ‘‘ది శటానిక్ వర్సెస్’’ పుస్తకాన్ని అప్పట్లో ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న రాజీవ్ గాంధీ నిషేధించి తప్పు చేశారని చెప్పారు. నిజానికి ఈ పుస్తకంపై విధించిన బ్యాన్ గురించి.. తనను అప్పట్లో ప్రశ్నించినా.. ఈ సమాధానమే చెప్పి ఉండేవాడినన్నారు. ఈ పుస్తకంపై బ్యాన్ విధించకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం చేసిన చిదంబరం మాటలు కాస్తంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. దశాబ్దాలు గడిచిన తర్వాత.. పార్టీ అధికారంలో లేని సమయంలో.. గాంధీ ఫ్యామిలీలో కీలక సభ్యులు చేసిన తప్పుల చిట్టా విప్పుతున్న చిదంబరం మాటలకు ‘సోనియమ్మ’ ఎలా రియాక్ట్ అవుతారో..?