Begin typing your search above and press return to search.

జైట్లీకి అంత లేదు..సంఘ్ మొత్తం చేస్తోంది

By:  Tupaki Desk   |   13 Feb 2018 2:16 PM GMT
జైట్లీకి అంత లేదు..సంఘ్ మొత్తం చేస్తోంది
X
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ త‌న దూకుడు పెంచుతున్నారు. క‌ర్ణాటక‌ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బీజేపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ ఈ సంద‌ర్భంగా దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన నోట్ల ర‌ద్దుపై స్పందించారు. దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను బీజేపీ తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తోంద‌ని ఆరోపించారు. అందుకే ప్రతి సంస్థలో తమ మనిషిని సంఘ్ ఉంచిందని విమర్శించారు. అసలు నోట్ల రద్దు ఆలోచన ఆర్బీఐదో లేక అరుణ్ జైట్లీదో కాదని.. ఆర్ఎస్ఎస్‌ సూచన మేరకే రద్దు చేశారని రాహుల్ ఆరోపించారు.

`ఆర్థికశాఖలోని ఓ అధికారిదే ఈ నోట్ల రద్దు ఆలోచన. ఆయన ఎవరో కాదు.. ఆరెస్సెస్ వ్యక్తే. తన ఆలోచనను ప్రధాని మెదడులోకి ఎక్కించారు. ఆయన రద్దు చేసేశారు` అని రాహుల్ ఆరోపించారు. ఈ చ‌ర్య‌కు..ఆర్థిక‌మంత్రికి ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాగా, ఆర్మీ వాళ్లు ఆరు నుంచి ఏడు నెలల పాటు మిలిటరీకి ఇచ్చే శిక్షణను సంఘ్ పరివార్ కేవలం మూడు రోజుల్లో పూర్తి చేస్తుందన్న ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్స్‌ పై రాహుల్ సీరియస్ అయ్యారు. ‘యుద్ధానికి సంసిద్ధం కావడానికి సైన్యానికి ఆరేడు నెలల సమయం పడుతుంది. కానీ మనకు (సంఘ్‌ శ్రేణులకు) రెండు - మూడు రోజులు చాలు. ఇది మన సామర్థ్యం. ఇది మన క్రమశిక్షణ’ అని అన్నారు. ‘ఒకవేళ రాజ్యాంగం అనుమతినిస్తే ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా (యుద్ధాన్ని) ఎదుర్కొనేందుకు స్వయం సేవకులు సిద్ధం’ అని భగవత్‌ అన్నారు. దీనిపై రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ ‘సరిహద్దుల్లో మన సైనిక జవాన్లు రక్తం ధారపోస్తున్నారు. సైన్యం గురించి మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలు వినడానికే బాధగా ఉంది. ఆయన పొరపాటు చేశారు. పారా మిలిటరీ బలగాలైనా - సైన్యమైనా - వైమానిక దళమైనా - నౌకాదళమైనా వారంతా దేశ భద్రత కోసం పని చేస్తున్నారు. ప్రాణ త్యాగం చేస్తున్న సైనికులపై భగవత్‌ వ్యాఖ్యలు వారిని అవమానించడమే. ఇది ప్రతి భారతీయుడికి అవమానకరమే. ప్రతి సైనికుడు జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పిస్తారు. భగవత్‌ వ్యాఖ్యలు మన జాతీయ పతాకాన్ని అవమానించడమే’ అని అన్నారు. ‘సైన్యాన్ని అవమానించడం మీకే సిగ్గుచేటు భగవత్‌.. దీనిపై ఆరెస్సెస్‌ క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

మ‌రోవైపు మోహ‌న్ భ‌గ‌వ‌త్ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం కావ‌డం, వ‌రుస‌గా ఆయ‌న పార్టీని ఇర‌కాటంలో ప‌డేస్తున్న తీరుపై బీజేపీ పెద్ద‌లు దృష్టిసారించినట్లు స‌మాచారం. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోహన్‌ భాగవత్‌ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారని, అందుకే ఆ ఎన్నికల్లో గెలవాల్సింది, ఓడిపోయామని బీజేపీ వర్గాలు ఇప్పటికీ వాదిస్తాయి. బీసీలు ఎక్కువగా ఉన్న బీహార్‌ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల బీసీలు దూరమయ్యారని తాజాగా ఆర్మీపై ఆయ‌న ఇబ్బందిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. భగవత్‌ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆర్ ఎస్ ఎస్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మోహన్‌ భగవత్‌ సామాన్యులు - సంఘ్‌ వలంటీర్ల మధ్య మాత్రమే పోలిక తెచ్చారని, భారత సైన్యంతో స్వయం సేవకులను పోల్చే అవకాశమే లేదని ఆర్ ఎస్ ఎస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ వైద్య తెలిపారు. భగవత్‌ వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ స్పందిస్తూ ‘ఆర్ ఎస్ ఎస్‌ సంసిద్ధతను తెలియజేసేందుకు భగవత్‌ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు’ అని అన్నారు. సైన్యం పట్ల - సైనిక జవాన్ల త్యాగాల పట్ల సంఘ్‌కు ఎంతో గౌరవం ఉందని వివాదాన్ని త‌గ్గుముఖం ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారు.