Begin typing your search above and press return to search.

టిక్కట్లు ఇచ్చేశారు... తన్నుకు చావడమే...

By:  Tupaki Desk   |   13 Nov 2018 5:31 AM GMT
టిక్కట్లు ఇచ్చేశారు... తన్నుకు చావడమే...
X
కాంగ్రెస్ పార్టీలో అసలు పోరు ఇప్పుడు ప్రారంభమవుతుంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అభ్యర్ధుల ప్రకటనతో అసలు యుద్ధం ప్రారంభమైంది. ఇక అసంతృప్తులు - అసమ్మతి నేతలు ఒక్కొరొక్కరుగా బయటకు వచ్చే సమయం ప్రారంభమైంది. రెడ్ల పార్టీగా ముందునుంచి పేరున్న కాంగ్రెస్ ఆ పార్టీ ఆ పేరును కాపాడుకుంది. తొలి జాబితా 65 మందిలో 23మంది రెడ్లకు టిక్కట్లు ఖరారు చేసింది అధిష్టానం. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు కులాల వారీగానే మనుగడ సాగిస్తాయని మరోసారి బహిర్గతమైంది. తొలి జాబితాపై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ జాబితాను విడుదల చేయకుండా అనేక మార్పులు చేర్పులు చేశారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే అగ్ర నాయకులు. వారి అనుచరణ గణానికి టిక్కట్లు ఇప్పించుకోవడంలో ఏ ఒక్కరూ తక్కువ కాదని నిరూపించుకున్నారు. అధిష్టానం సైతం ఆచి తూచి అడుగులు వేసిందని చెబుతున్నారు కాని లోలోపల టిక్కట్ల విషయంలో సంఘర్షణ జరిగిందని వార్తలు వస్తున్నాయి. " ఇదంతా అనవసరం. టిక్కట్లు ఇచ్చాం. ఇక తన్నుకు చచ్చినా... కలిసి కట్టుగా పని చేసుకున్నా... విజయంతోనే రండి " అని పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు - ఇతర సీనియర్ నాయకులకు చెప్పినట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీ కావడంతో కూటమిని గట్టెక్కించే బాధ్యత ఆ పార్టీ మీద ఎక్కువ ఉందంటున్నారు.అయితే ఇది సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదనే వాదన కూడా వినిపిస్తుంది. రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులతో సమావేశమైన ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు కాంగ్రెస్ అభ్యర్ధులు ప్రకటించిన తర్వాత వారిలో అసలు వివాదాలు బహిర్గతమవుతాయి. వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి అని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాను చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అంచనా నిజమయ్యేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తొలి జాబితా ప్రకారం ఆశావహులు చాలా మందికి నిరాశ ఎదురైనట్లుగా కనిపిస్తోంది. వీరంతా అధిష్టానం బుజ్జగింపులకు తలవొంచుతారో లేక హూంకరిస్తారో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది.