Begin typing your search above and press return to search.

మోడీ నా క‌ళ్ల‌లోకి చూడ‌లేక‌పోతున్నారు

By:  Tupaki Desk   |   20 July 2018 9:12 AM GMT
మోడీ నా క‌ళ్ల‌లోకి చూడ‌లేక‌పోతున్నారు
X
ప్రధాని మోడీ తన కళ్లలోకి నేరుగా చూడలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అందుకు కార‌ణాన్ని కూడా ఆయ‌న వివ‌రించారు. ప్రధాని నన్ను చూసి నవ్వుతున్నారని, కానీ ఆయనలో ఆందోళన కనిపిస్తున్నదని రాహుల్ విశ్లేషించారు. తనను కాకుండా మరోవైపు ప్రధాని చూస్తున్నారని, దాన్ని నేను అర్థం చేసుకోగలను అని, ఎందుకంటే మోడీ అసత్యమాడుతున్నారని రాహుల్ తెలిపారు. లోక్‌స‌భ వేదిక‌గా రాహుల్ ఈ విశ్లేష‌ణ చేశారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అవిశ్వాసంపై మాట్లాడుతున్న సమయంలో ఆయన 21వ శతాబ్ధపు రాజకీయ ఆయుధానికి ఆంధ్రప్రదేశ బలైందని రాహుల్ అన్నారు. గల్లా జయదేవ్ ప్రసంగం పట్ల బాధను వ్యక్తం చేసిన ఆయన ఎన్డీఏ ప్రభుత్వం తప్పుడు వాగ్ధానాలతో మోసం చేస్తోందన్నారు. త‌ప్పుడు వాగ్దానాల‌తో ప్ర‌భుత్వం దాడి చేస్తోందని, దానిలో భాగంగా అందరూ విగతులవుతున్నారని అన్నారు.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్‌సభలో రాహుల్ మాట్లాడుతూ...రైతుల రుణాలను ఎత్తివేస్తామని ప్రధాని అంటారు, కానీ ఆర్థిక మంత్రి మాత్రం ఆ రుణాలను మాఫీ చేయలేమంటున్నారు. ప్రభుత్వంలో ద్వంద వైఖరి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయి, కానీ మన దగ్గర మాత్రం ధరలు పెరుగుతున్నాయన్నారు. ఈ సంద‌ర్భంగానే రాఫెల్ డీల్ గురించి ప్రస్తావించారు. ఆ ఒప్పందం వల్ల ప్రధాని మోడీ మిత్రుడికి లాభం చేకూరిందని రాహుల్ ఆరోపించారు. ఆ సమయంలో సభలోనే ఉన్న ప్రధాని మోడీ నవ్వుతూ కనిపించడంతో ``ప్రధాని నన్ను చూసి నవ్వుతున్నారని, కానీ ఆయనలో ఆందోళన కనిపిస్తోంది. నన్ను కాకుండా మరోవైపు ప్రధాని చూస్తుండటాన్ని నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే మోడీ అసత్యమాడుతున్నారు కాబట్టి`` అని రాహుల్ అన్నారు. దీంతో సభలో గందరగోళం మొదలైంది. బీజేపీ సభ్యులు రాహుల్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాఫెల్ డీల్‌పై ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని గతంలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆ విషయాన్ని కూడా రాహుల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అసలు ఫ్రాన్స్‌తో రాఫెల్ యుద్ధవిమానాల గురించి ఎటువంటి ఒప్పందం కుదరలేదని రాహుల్ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిని తాను స్వయంగా కలిశానని, అటువంటి ఒప్పందం ఏదీ జరగలేదని ఆయన చెప్పారని రాహుల్ సభలో తెలిపారు. సీతారామన్ కూడా రాఫెల్ ఒప్పందంపై క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మాట్లాడడంతో .. బీజేపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ క్షమాపణులు చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు.

మోడీ వ్యర్థ వాగ్ధానాలతో దేశం నష్టపోయిందని రాహుల్ ఆరోపించారు. నోట్ల రద్దుతో చిన్నా వ్యాపారస్తులను దారుణంగా దెబ్బతీశారన్నారు. దేశంలో యువత, దళితులు, గిరిజనులు, మహిళలు బాధితులవుతున్నారన్నారు. ప్రతి అకౌంట్‌కు 15 లక్షలు వస్తాయన్నారు, కానీ అలా జరగలేదని రాహుల్ అన్నారు. రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగం ఇస్తారన్నారు, కానీ ఇప్పుడు కేవలం 4 లక్షల మందికి మాత్రమే ఉద్యోగం కల్పించే అవకాశం ఉందన్నారు. చైనా కేవలం 24 గంటల్లో 50వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. కానీ మన ప్రభుత్వం 24 గంటల్లో కేవలం 400 మందికి మాత్రమే ఉద్యోగం కల్పించిందన్నారు. చిన్న వ్యాపారులు, పేదల నుంచి ప్రభుత్వం డబ్బు లాగేసుకుందని ఆరోపించారు. జియో యాడ్‌లో మోడీ బొమ్మ కనిపిస్తోందని, అంటే ప్రధాని కేవలం సంపన్నుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని రాహుల్ అన్నారు.