Begin typing your search above and press return to search.

మోడీని రానీయకుండా కాంగ్రెస్ ప్లాన్ ఇదే..

By:  Tupaki Desk   |   16 Jun 2018 7:05 AM GMT
మోడీని రానీయకుండా కాంగ్రెస్ ప్లాన్ ఇదే..
X
బీజేపీని 2019లో ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ వేసింది.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపునకు రోడ్ మ్యాప్ ను ఖరారు చేసేందుకు ఏకే ఆంటోని నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి ఈ బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఈ కమిటీ జిల్లా, రాష్ట్ర కమిటీలతో సంప్రదింపులు జరిపి ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను హైకమాండ్ దృష్టికి తీసుకువెళతారు.. అనంతరం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ నివేదికలను అనుసరించి వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై, ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగాలనే అంశంపై పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారు.

కేంద్రంలో నరేంద్రమోడీని రెండోసారి అధికారంలోకి రాకుండా చేయాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రాతినిధ్యం పెరిగేలా వీలైనన్నీ తక్కువ స్థానాల్లోనే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కనిష్ట స్థాయిలో కేవలం 250 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

బీజేపీపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. భావసారూప్యం కలిగిన పార్టీలతో మహాకూటమి ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్నకాంగ్రెస్ పార్టీ ఈ మేరకు బీజేపీయేతర పార్టీలకు ఎక్కువ స్థానాలు సర్దుబాటు చేసేలా తాను తక్కువ సీట్లకే పరిమితం కావాలని యోచిస్తున్నట్టు సమాచారం. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఇతర పార్టీలతో సీట్ల సర్ధుబాటుపై రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ బ్లూప్రింట్ రూపకల్పనలో నిమగ్నమైంది.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొనేందుకు ఏర్పాటైన మహాకూటమిలో చేరే ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ ప్రాతనిధ్యం కల్పిస్తూ పార్టీ 250 కన్నా తక్కువ స్థానాల్లో పోటీకి పరిమితం కావాలని పార్టీ నేతలు తాజాగా వెల్లడించడం దేశవ్యాప్తంగా సంచలనమైంది.