Begin typing your search above and press return to search.

రాహుల్ ప్ర‌శ్న‌ల‌కు కాంగ్రెస్ సీనియ‌ర్ల మైండ్ బ్లాంక్‌

By:  Tupaki Desk   |   9 Nov 2018 8:53 AM GMT
రాహుల్ ప్ర‌శ్న‌ల‌కు కాంగ్రెస్ సీనియ‌ర్ల మైండ్ బ్లాంక్‌
X
కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ‌లోని ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. ఓ వైపు త‌న టీంకు ప్ర‌త్యేక బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూనే...మ‌రోవైపు తాను సైతం స్వ‌యంగా రంగంలోకి దిగుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్ అవుతోందని - పార్టీ ర‌థ‌సార‌థి ప్ర‌శ్న‌ల‌కు వారు స‌మాధానం ఇచ్చుకోలేని ప‌రిస్థితి ఎదురైంద‌ని స‌మాచారం. ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితాలో ఓయూ విద్యార్థులు ఏరని రాహుల్ గాంధీ ప్రశ్నించినట్లు స‌మాచారం. ఢిల్లీలో గత మూడు రోజులుగా(మంగళ - బుధ - గురువారం) జరుగుతున్న స్క్రీనింగ్‌ కమిటీ భేటీల్లో కమిటీ ఛైర్మన్‌ భక్త చరణ్‌ దాస్‌ - సభ్యులు శర్మిష్ఠ ముఖర్జీ - జ్యోతిమణి సెన్నిమలై - పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్‌.సి.కుంతియా - పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి - పొన్నం ప్రభాకర్‌ - ప్రచార కమిటీ ఛైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క - సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి - శాసనమండలి పక్ష నేత షబ్బీర్‌ అలీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించార‌ని స‌మాచారం.

విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఓయూ విద్యార్థుల పేర్లు లేకుండా పొందు ప‌ర్చిన జాబితాపై రాహుల్ అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. జాబితాలో ఓయూ నాయ‌కులు ఎక్క‌డ‌ని రాహుల్ ప్ర‌శ్నించ‌డంతో స్ర్కీనింగ్ కమిటీ సభ్యులు నాలుక‌ కరుచుకున్నట్లు స‌మాచారం. సమాధానం చెప్పలేక సభ్యులు తికమకపడ్డట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ క‌మిటీ ఇచ్చిన జాబితాను నిలుపుదల చేసిన రాహుల్ గాంధీ పున:పరిశీలిస్తున్నట్లు స‌మాచారం. అందుకే జాప్యం జ‌రిగింద‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు ఓయూలోని విద్యార్థి సంఘాల నేత‌లు తాజా ఎపిసోడ్‌ పై తీవ్రంగా స్పందించారు. కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు డబ్బులకు ప్రాధాన్యం ఇస్తూ - తమకు న‌చ్చిన‌ట్లుగా ఇష్టం వచ్చినట్లు టిక్కెట్లు పంచుకుని ఓయూ విద్యార్థుల త్యాగాలను తడిగుడ్డతో గొంతుకోయ ప్రయత్నించార‌ని ఓయూవిద్యార్థులు భ‌గ్గుమ‌న్నారు. ``టిక్కెట్లు వచ్చుడో మేం చచ్చుడో`` అని పేర్కొంటూ టిక్కెట్లు ఇవ్వకుంటే మా శవాలే తెలంగాణకి వెళతాయని డిల్లీలో శుక్రవారం ఆందోళనకు సిద్ధ‌మ‌య్యారు. ఓయూ జేఏసీ నేతలు కోటూరి మానవతా రాయ్ - దరువు ఎల్లన్న,దుర్గం భాస్కర్ - చరణ్ కౌషిక్ యాదవ్ - కేతూరి వెంకటేష్ - కురువా విజయ్ - కిరణ్ యాదవ్ తదితరులు ఈ ఆందోళ‌నకు సిద్ధ‌మైన వారిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.