Begin typing your search above and press return to search.

మోడీ, ట్రంప్ ఎందుకు గెలిచారో తేల్చిన యువ‌రాజు

By:  Tupaki Desk   |   20 Sep 2017 5:55 PM GMT
మోడీ, ట్రంప్ ఎందుకు గెలిచారో తేల్చిన యువ‌రాజు
X
అగ్ర‌రాజ్యం అమెరికాకు రెండు వారాల పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అనేక కొత్త విష‌యాల‌ను పంచుకుంటున్నారు. ఇప్ప‌టికీ వార‌స‌త్వం గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు పంచుకున్న రాహుల్ తాజాగా ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించిన ఇద్ద‌రు ప్ర‌ముఖుల గెలుపును తాజాగా కొత్తగా విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో నిరుద్యోగితపై పెరిగిపోయిన అసహనం వల్లే భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లాంటి నేతలు విజయం సాధించారని సూత్రీకరించారు. ప్రతిష్ఠాత్మక ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ విద్యార్థులతో తన అభిప్రాయాలను పంచుకున్న సందర్భంగా విశ్లేషించారు.

సరిపడినన్ని ఉద్యోగాలు సృష్టించలేకపోవడం వల్లే కాంగ్రెస్‌ పార్టీ 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసిందని రాహుల్ గాంధీ అంగీకరించారు. ఉద్యోగిత అనేది సాధికారత, స్వేచ్ఛ అనే అంశాలతో ముడిపడినదని, ఉపాధి కల్పన భారతీయులను జాతి నిర్మాణంలో భాగస్వాములను చేస్తుందని రాహుల్ వివ‌రించారు. భారత్‌, అమెరికాల్లో ఉద్యోగాల కల్పన ఆశించినస్థాయిలో లేకపోవడం వల్లే మోడీ, ట్రంప్‌ అధికారంలోకి రాగలిగారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ‘ఎక్కువ మంది జనాభాకు ఉద్యోగాలు లేకపోవడం, ఆశావహమైన భవిష్యత్‌ కనిపించకపోవడం అనే అంశాలు ప్రజలను బాధించాయి. అందుకే వారు ఈ నాయకులకు మద్దతు తెలిపారు. అయితే నిరుద్యోగిత అనేది ప్రధాన సమస్య అని ఎవరూ గుర్తించకపోవడం అతిపెద్ద సమస్య. ట్రంప్‌ పాలన గురించి నాకు తెలియదు. కానీ భారత ప్రధాని మోడీ మాత్రం ఉపాధి కల్పన విషయంలో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు’ అని ప్రధాని మోడీపై విమర్శలు చేశారు.

అమెరికా పర్యటనలో భాగంగా వ్యాపార, రాజకీయ, ఇతర రంగాల నిపుణులను కలిసినప్పుడు రాహుల్‌గాంధీ ఎక్కువగా నిరుద్యోగం గురించే ప్రస్తావిస్తున్నారు. ప్రతిరోజు 30 వేల మంది జాబ్‌మార్కెట్‌లోకి వస్తుండగా.. ప్రభుత్వం రోజుకు 500 ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తున్నదని ఇంతకుముందు కాలిఫోర్నియా యూనివర్సిటీలో చెప్పిన రాహుల్‌.. తమ హయాంలో ఆగ్రహం చెందిన నిరుద్యోగులే ప్రస్తుతం ప్రధాని మోడీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వస్తున్నదని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో పేర్కొన్నారు. చైనాతో పోటీపడాలంటే ఉద్యోగాలు కావాలని అన్నారు.