Begin typing your search above and press return to search.

మోడీ ఓ దొంగ‌..రాహుల్‌ - ఓవైసీ నిప్పులు

By:  Tupaki Desk   |   22 Sep 2018 12:16 PM GMT
మోడీ ఓ దొంగ‌..రాహుల్‌ - ఓవైసీ నిప్పులు
X
రాఫెల్ యుద్ధ విమానాల వివాదం కొనసాగుతోంది. ఒక్కో ప‌రిణామంతో ఈ ఎపిసోడ్‌ లో బీజేపీ దోషిగా నిల‌బ‌డింద‌ని అంటున్నారు. రూ. 58 వేల కోట్ల రాఫెల్ ఒప్పందంలో ఫైటర్‌జెట్ విమానాల తయారీ సంస్థ దస్సాల్ట్ ఏవియేషన్‌ కు భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థను చేర్చుకోవాలని ప్రధాని మోడీయే తమకు సూచించారని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఎపిసోడ్‌ పై స్పందించారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే.. భారత ప్రధాని మోడీని దొంగ అంటున్నారని పేర్కొన్నారు. రాఫెల్ ఒప్పందం విషయంలో హోలాండే చెప్పింది నిజమా?.. అబద్ధమా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా ఎందుకు రావడం లేదని అడిగారు.

రాఫెల్ ఒప్పందం రూ. 30 వేల కోట్ల కుంభకోణం అని రాహుల్ గాంధీ ఆరోపించారు. అనిల్ అంబానీకి మోడీ రూ. 30 వేల కోట్ల బహుమానం ఇచ్చారని విమర్శించారు. హోలాండే వ్యాఖ్యలతో భారత ప్రధాని - దేశ కాపలాదారుడు.. అవినీతిపరుడు - దొంగ అని తేలిపోయిందన్నారు. ``రాఫెల్ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ల విలువ ఎంతో చెప్పమంటే రహస్యం అన్నారు. ఇది రహస్యం కాదు.. దేశ ప్రజలందరికీ తెలియాల్సిన విషయమని రాహుల్ చెప్పారు. పార్లమెంట్‌ లో మాట్లాడితే రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అబద్దాలు చెప్పారు. అనిల్ అంబానీ ఎప్పుడూ విమానాలు తయారు చేయలేదు. హెచ్‌ ఏఎల్ విమానాలు తయారు చేయలేదని ఒప్పందం రద్దు చేసుకున్నామన్నారు. ఎవరు ఎవరి కోసం అబద్ధాలు చెబుతున్నారు. నిర్మలా సీతారామన్ - మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాఫెల్ ఒప్పందంపై సంతకం చేయలేదు. మోడీ సంతకం చేశారు. మోడీ సొంతంగా అనిల్ అంబానీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. భారత ప్రజల జేబుల్లోంచి డబ్బు తీసి అనిల్ అంబానీ జేబులో వేశారు`` అని రాహుల్ నిప్పులు చెరిగారు.

మ‌రోవైపు హోలాండే వ్యాఖ్యలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాఫెల్ డీల్ విషయంలో ఎవరు అబద్దాలాడుతున్నారనేది దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని ఓవైసీ తెలిపారు. ఈ విషయంలో హోలాండే అబద్దాలు ఆడుతున్నారా? లేక మోడీ నిజాలు చెప్పడం లేదా? అని ప్రశ్నించారు. ఎవరిది నిజమో కేంద్ర రక్షణ శాఖ చెప్పాల్సిన అవసరం ఉందని ఓవైసీ అన్నారు. కాగా, రాఫెల్ డీల్‌ పై నిరాధార ఆరోపణలు చేయొద్దని కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ ప్రతిపక్షాలకు సూచించారు. రాఫెల్ ఒప్పందం విషయంలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ ఒక ప్రకటనను విడుదల చేస్తుందని పేర్కొన్నారు. అప్పుడు ఆ ప్రకటనను ప్రతిపక్షాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు అని తెలిపారు. ఏమీ తెలియకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్ అన్నారు.