Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుపై అట్రాసిటీ కేసు పెట్టాల‌ట‌!

By:  Tupaki Desk   |   27 Jun 2017 10:36 AM GMT
చంద్ర‌బాబుపై అట్రాసిటీ కేసు పెట్టాల‌ట‌!
X
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుపై ఏపీ పీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. తూర్పుగోదావ‌రి జిల్లా రంప‌చోడ‌వ‌రం ఏజెన్సీ ప్రాంతంలోని చాప‌రాయిలో క‌లుషితాల కార‌ణంగా 16 మంది చ‌నిపోవ‌డం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితుపై దాడుల కేసుల‌కు సంబంధించి కాసేప‌టి క్రితం హైద‌రాబాదులో మీడియాతో మాట్లాడిన ర‌ఘువీరా... ఈ రెండు విష‌యాల్లో చంద్ర‌బాబు స‌ర్కారే దోషిగా నిలిచింద‌ని ఆరోపించారు.

గిరిజ‌న ప్రాంతంలో క‌లుషిత నీరు కార‌ణంగా చోటుచేసుకున్న 16 మంది మ‌ర‌ణాల‌కు చంద్ర‌బాబునే బాధ్యుడిని చేయాల‌ని ర‌ఘువీరా డిమాండ్ చేశారు. చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంలోనే సీఎం చంద్రబాబు ఒక మాట, డిప్యూటీ సీఎం నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌ మరో మాట మాట్లాడటం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. తక్షణం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రలో దళితుల పట్ల దాడులు... టీడీపీ ప్రభుత్వంలో సర్వసాధారణంగా మారాయన్నారు.

దళితులను సంఘ బహిష్కరణలు చేసినా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. దళితులను బహిష్కరించినా పట్టించుకోని పోలీసులు.. వారిని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ విషయంలో ఆ గ్రామ ప్రజలపై కాదు.. సీఎం చంద్రబాబు పైనే నేరుగా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ర‌ఘువీరా సూచించారు. రాష్ట్రంలో గిరిజ‌నులు, ద‌ళితులంటే ప్ర‌భుత్వానికి లెక్క లేకుండా పోయింద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ద‌ళితుల సంక్షేమంపై కాకుండా ఉన్న‌త వ‌ర్గాల ప్ర‌యోజ‌నాల కోస‌మే ప్ర‌భుత్వం పాకులాడుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇలాంటి ప్ర‌భుత్వానికి రాష్ట్రాన్ని పాలించే హ‌క్కు లేద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/