Begin typing your search above and press return to search.

అక్కడ తెదేపా, వైకాపా కలిసిపోయాయంట!

By:  Tupaki Desk   |   4 Oct 2015 4:30 PM GMT
అక్కడ తెదేపా, వైకాపా కలిసిపోయాయంట!
X
ఇప్పుడు అధికారంలో ఉన్న వారొకరు, ఈసారికి అధికారం తమదే అని విర్రవీగుతున్న వారొకరు.. వీరిద్దరూ ఒక ఒరలో ఇమడని రెండు కత్తుల్లాగా నిత్యం కొట్టుకుంటూనే ఉంటారు తప్ప.. ఛాన్సు వస్తే ఒకరి మీద ఒకరు విమర్శలతో విరుచుకుపడుతూ ఉంటారే తప్ప.. వారిద్దరూ కలిసిపోవడం ఏంటబ్బా అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. కానీ.. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెబుతున్న భాష్యం ప్రకారం.. ఇది నిజమే. కాకపోతే.. వారిద్దరూ కలిసిపోవడం అనేది రాజకీయంగా కాదులెండి. కేవలం.. స్థానికంగా అవినీతి సొమ్మును పంచుకోవడంలో మాత్రమే.

సాధారణంగా స్థానికంగా జరిగే పనుల్లో.. అవినీతికి పాల్పడి సొమ్ములు కాజేసే అవకాశం వస్తే.. అందులో ఎక్కువగా అధికార పార్టీకి చెందిన వాళ్లే లబ్ధి పొందుతూ ఉంటారు.. తమకు ఛాన్సు మిస్సయింది గనుక.. ప్రతిపక్షానికి చెందిన నాయకులు వారి మీద తమ అక్కసును విమర్శల రూపంలో వెళ్లగక్కుతూ ఉంటారు. అయితే ఎంత అవినీతి సొమ్మును పంచుకోవడానికి అయినా సరే.. ఈ రెండు పార్టీల వాళ్లూ మిలాఖత్‌ అయిపోవడం అనేది చాలా అరుదుగా జరిగే సంగతి.

రఘువీరారెడ్డి చెబుతున్న ప్రకారం.. ఇసుక మాఫియాలో ఇదే జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తీరువా విధానం మార్చేయడంతో.. స్థానికంగా నాయకులు ఇష్టారాజ్యంగా చెలరేగుతున్నారు. ఇసుకమాఫియా అనేది వందల వేల కోట్ల రూపాయల అక్రమార్కుల సామ్రాజ్యానికి నిదర్శనంగా మారిపోయింది. అయితే ఈ ఇసుక మాఫియా దందాలు కూడా గోదావరి జిల్లాల్లో విచ్చలవిడిగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గోదావరి జిల్లాల్లో అసలు తమ దందాల గురించి విపక్షాలు చిన్న విమర్శ చేసే అవకాశం కూడా ఇవ్వకూడదనుకున్నారేమో.. తెలుగుదేశం వారు వైకాపాతో మిలాఖత్‌ అయిపోయి.. ఇసుక మాఫియాను నడిపిస్తున్నారట. ప్రభుత్వానికి అధికారికంగా ఏడాదిలో 700 కోట్ల లాభం వస్తే.. అనధికారికంగా రాష్ట్రంలో అయిదువేల కోట్లు దోచేస్తున్నారని పీసీసీ చీఫ్‌ అంటున్నారు. వీరి యవ్వారం చూస్తోంటే.. ఎక్కడైనా శత్రువులే గానీ.. దోపిడీలో మాత్రం.. అందరూ ఒక తాను ముక్కలే అనిపిస్తోంది కదూ!