Begin typing your search above and press return to search.

కోడెల చాలా మంచి వారన్న వైఎస్సార్సీపీ ఎంపీ!

By:  Tupaki Desk   |   21 Aug 2019 10:14 AM GMT
కోడెల చాలా మంచి వారన్న వైఎస్సార్సీపీ ఎంపీ!
X
కోడెల శివప్రసాద్ రావు ఘనకార్యాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్లే ఎలా సమర్థించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి కోడెల వ్యవహారాలు ఒక్కొక్కటిగా చర్చకు వస్తూనే ఉన్నాయి. పోలింగ్ రోజున ఇనిమెట్ల వద్ద జరిగిన రాద్ధాంతంపై పెద్దరాజకీయమే జరిగింది. అయినప్పటికీ తనకు ఎదురులేదని కోడెల ప్రకటించుకున్నారు.

అయితే సత్తెనపల్లి నియోజకవర్గం ప్రజలు మాత్రం కోడెలను ఓడించారు. ఇక రాష్ట్రంలో అధికారం చేతులు మారినప్పటి నుంచి ఎవరి మీద అయినా ఎక్కువ ఫిర్యాదులు అందాయంటే అది కోడెల కూతురు - కొడుకు మీద మాత్రమే. వారు టీడీపీ హయాంలో తమ నుంచి భారీగా వసూళ్లు సాగించారని అనేక మంది పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తమకు న్యాయం చేయమని వారు కోరుతూ ఉన్నారు.

ఆఖరికి ఆ వ్యవహారాల్లో కోడెల కుటుంబాన్ని ఎలా సమర్థించాలో టీడీపీకే అంతుబట్టని పరిస్థితి. అందుకే కామ్ గా ఉంది. ఇక అసెంబ్లీని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిస్తున్నప్పుడు ఏపీ వాటాగా దక్కిన ఫర్నీచర్ ను కోడెల తన ఇంటికి తరలించుకుపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

బాధ్యతాయుతమైన స్పీకర్ స్థానంలో ఉండి ప్రభుత్వ డబ్బుతో కొన్న ఫర్నీచర్ ను కోడెల తన ఇంటికి - ఆఫీసుకు తరలించుకుపోవడంపై తీవ్రమైన చర్చజరుగుతూ ఉంది. ఈ వైనాన్ని ప్రజలు కూడా తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. స్పీకర్ గా కోడెల తీరుపైనే చాలా విమర్శలున్నాయి. ఆపై ఇలా ప్రజల ఆస్తులకు కూడా కన్నం పెట్టి తన ఇంటికి తరలించుకుపోవడంపై మరిన్ని విమర్శలు వస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో టీడీపీ మారు మాట్లాడటం లేదు. ఆ సంగతలా ఉంటే..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మాత్రం ఈ విషయాన్ని నమ్మలేకపోతూ ఉన్నాడట! తనకు కోడెల చాలా కాలంగా తెలుసని - ఆయన చాలా మంచి వాడని ఒక టీవీ చర్చా కార్యక్రమంలో ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ పై కోడెల మంచితనాన్ని చాలానే చెప్పారు. అలాంటి వ్యక్తి ఇలా చేశాడంటే తను నమ్మలేకపోతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఆధారాలతో సహా దొరికిపోయాకా - ఆ విషయాన్ని కోడెలే ఒప్పుకున్నాకా.. ఇంకా ఈ ఎంపీగారు కోడెల మంచితనాన్నే ఎక్కువగా నమ్ముతున్నట్టుగా ఉన్నారు. వాస్తవాలను అర్థం చేసుకోలేకపోతున్నట్టున్నారు!