Begin typing your search above and press return to search.

రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ క‌న్ను..ఎత్తేస్తారా?

By:  Tupaki Desk   |   19 Aug 2019 11:42 AM GMT
రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ క‌న్ను..ఎత్తేస్తారా?
X
అనూహ్య రీతిలో త్రిపుల్ త‌లాక్ ర‌ద్దు, క‌శ్మీర్‌ కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఎత్తివేత వంటి అంశాల‌కు సంబంధించిన బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంతో పాటుగా విజ‌య‌వంతంగా ఆమోదించుకున్న బీజేపీ నేత‌ల క‌న్ను రిజ‌ర్వేష‌న్ల‌పై ప‌డిందా? పార్టీ మాతృక‌గా నిలిచే ఆర్ ఎస్ ఎస్ రూపంలో ఇందుకు రంగం సిద్ధం చేస్తోందా? తాజా ప‌రిణామాల ఆధారంగా ఈ చ‌ర్చ జ‌రుగుతోంది. ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ తాజాగా చేసిన కామెంట్లు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. ఢిల్లీలోని ఇగ్నోలో నిర్వహించిన జ్ఞాన్ ఉత్సవ్ కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ రిజర్వేషన్ల అనుకూలురు, వ్యతిరేకుల మధ్య సామరస్య పూర్వక వాతావరణం నెలకొల్పేందుకు సంప్రదింపులు అవసరం అని పేర్కొన్నారు. త‌ద్వారా తేనెతుట్టను క‌దిపారు.

2015లో ఉత్తరప్రదేశ్‌ లోని గోరఖ్‌ పూర్‌ లో ఆరెస్సెస్ కార్యకర్తల సమావేశంలో దేశంలో రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. రిజర్వేషన్లను సమీక్షించాలన్న భగవత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీయడంతోపాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులను సృష్టించాయి. అయితే తాను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, ప్రస్తుత విధానంలో అర్హులైనవారికి రిజర్వేషన్ల ఫలాలు అందడంలేదన్నదే తన అభిప్రాయమని, అందుకే వాటిని సమీక్షించాలని కోరుతున్నానని అనంత‌రం భగవత్ పేర్కొన్నారు. ఈ వివాదం స‌ద్దుమ‌ణిగింద‌ని భావించిన త‌రుణంలో...తాజాగా మ‌ళ్లీ ఆయ‌న స్పందించారు. రిజర్వేషన్లపై గతంలో తాను మాట్లాడినప్పుడు పలు విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు. అసలు విషయం పక్కదోవ పట్టిందన్నారు.

కాగా, తాజాగా ఈ రిజర్వేషన్ల విషయంలో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మరోమారు మాట్లాడారు. ఎప్పుడు తాను రిజర్వేషన్లపై మాట్లాడినా.. సమాజంలోని వివిధ వర్గాల నుంచి స్పందన తీవ్రంగా ఉంటుందని పేర్కొన్న మోహ‌న్ భ‌గ‌వ‌త్ రిజర్వేషన్లపై శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని అభిలాషించారు. రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకిస్తున్న వారి భావాలను అర్థం చేసుకోవాలని, అలాగే వాటిని వ్యతిరేకిస్తున్న వాళ్లు అనుకూలంగా ఉన్న వారి ప్రయోజనాలను కూడా ఆలోచించాలని సూచించారు. కాగా, త‌న వ్యాఖ్య‌లు బీజేపీ స‌ర్కారుకు ఇబ్బంది క‌లిగించ‌వ‌ద్ద‌నే ఉద్దేశంతో మోహ‌న్ భ‌గ‌వ‌త్ క్లారిటీ ఇచ్చారు. ఆరెస్సెస్- బీజేపీ- బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం వేర్వేరని, బాధ్యతలు కూడా విభిన్నమని ముక్తాయించారు.