Begin typing your search above and press return to search.

ఒకే పార్టీ రెడ్ల మధ్య స్పష్టమైన చీలిక!

By:  Tupaki Desk   |   11 Nov 2017 5:30 PM GMT
ఒకే పార్టీ రెడ్ల మధ్య స్పష్టమైన చీలిక!
X
తెలంగాణ కాంగ్రెస్ లో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి కేసీఆర్ సర్కారు కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యం దక్కుతోందని.. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో నాయకత్వంలో ఎంతో కీలకంగా ఉండే రెడ్డి సామాజిక వర్గానికి విపరీతమైన అన్యాయం జరుగుతున్నదనే నినాదంతోనే కాంగ్రెస్ పార్టీ బలాలను పున:సమీకరించుకుంటున్నది. కేసీఆర్ కు వ్యతిరేకంగా శక్తుల పునరేకీకరణ అనే పర్వం కాస్తా.. రెడ్ల పునరేకీకరణ అన్నట్లుగా సాగుతున్నదనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ రెడ్ల మధ్యలోనూ ఓ చీలిక కనిపిస్తోంది. స్పష్టంగా ముఠాలు విడిపోయినట్లుగా అర్థమవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో రెబెల్ గుర్తింపు ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ బ్రదర్ లు రేవంత్ రెడ్డి రాకను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. కానీ ఆ పర్వం ముగిసిపోయిన తర్వాత.. వీరు రేవంత్ అనుకూల రెడ్డి వర్గాన్ని మొత్తం టార్గెట్ చేసి.. ద్వేషిస్తున్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి.

కోమటిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ జానారెడ్డి కూడా సరిగా వ్యవహరించడంలేదని తప్పు పట్టారు. గతంలో పీజేఆర్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న రోజుల్లో.. తమ పార్టీ సంఖ్యాబలం చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా గడగడ లాడించాడని.. జానారెడ్డి ఆ రకంగా చేయలేకపోతున్నారని తప్పు పట్టారు. అలాగే రేవంత్ రెడ్డి విషయంలో.. ఆయన తన రాజీనామాను ఆమోదింపజేసుకుంటే.. కాస్త నిజాయితీకి గుర్తింపు దక్కుతుందని కూడా కామెంట్ చేశారు. అంటే రేవంత్ స్ట్రాటెజిక్ గా.. తన రాజీనామా ఆమోదం పొందకుండా జాగ్రత్త తీసుకున్నారనే ఆలోచన కూడా తెలియజెప్పారు. జానా- రేవంత్ రెడ్డిలు తమ మధ్య సత్సంబంధాలే ఉన్న ఒకే గ్రూపు కావడం ఇక్కడ విశేషం. అదే సమయంలో పీసీసీ చీఫ్ పీఠం మీద కన్ను ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఉత్తం కుమార్ రెడ్డిని ఎప్పటినుంచో అసమర్థుడు అంటూనే ఉంటారు. ఆయన విషయంలో ఎన్నడూ రాజీపడలేదు.

ఈ పరిణామాలన్నీ గమనించినప్పుడు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గం నేతల మధ్యనే స్పష్టమైన చీలిక ఉన్నదని అర్థమవుతోంది. కాంగ్రెసు పార్టీలో గ్రూపులు ముఠాలు కొత్త కాదు. నిజానికి ఆ పార్టీకి ఉండే విలక్షణమైన బలం అదే. కాకపోతే కేసీఆర్ కు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకం కావాలని వారు కోరుకుంటున్నప్పుడు కనీసం వారి పార్టీలో ముఠాల వైఖరి తగ్గకపోతే ఎలా అని ప్రజలు భావిస్తున్నారు.