Begin typing your search above and press return to search.

ఈ శ‌ని, ఆదివారాలు బ్యాంకులు పనిచేస్తాయి

By:  Tupaki Desk   |   26 March 2017 9:31 AM GMT
ఈ శ‌ని, ఆదివారాలు బ్యాంకులు పనిచేస్తాయి
X
వ‌చ్చే శ‌ని, ఆదివారాల్లో బ్యాంకులు త‌న‌ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగించ‌నున్నాయి. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నింటితోపాటు ఆర్‌బీఐకి చెందిన కొన్ని కార్యాలయాలు కూడా ఈనెల 25 నుంచి వచ్చేనెల 1 వరకు ప్రతిరోజూ తెరిచి ఉంటాయని ఆర్బీఐ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ఈనెల 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో పన్ను వసూళ్లు, ప్రభుత్వ నగదు స్వీకరణ, చెల్లింపులు వంటి లావాదేవీలకు ఆటంకం కలుగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 1 వరకు అన్ని రోజులు తెరిచి ఉంచాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్‌బీఐ తన వెబ్‌ సైట్లో స్టేట్‌ మెంట్ విడుదల చేసింది. దీంతో ఈ శని - ఆదివారాల్లోనూ బ్యాంకింగ్ శాఖలు తెరిచే ఉంటాయి. ఆర్‌ బీఐలో ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలను చేపట్టే విభాగాలు కూడా వచ్చేనెల మొదటి తేదీ వరకు ప్రతిరోజూ పనిచేయనున్నాయి.

మ‌రోవైపు ప్రధానమంత్రి గ్రామీణ కల్యాణ్ యోజన కింద నల్లకుబేరులు స్వచ్ఛందంగా తమ ఆస్తులను ఈ నెలాఖరులోగా వెల్లడించాలని ఆదాయ పన్నుశాఖ స్పష్టం చేసింది. లేకపోతే చింతించక తప్పదని హెచ్చరించింది. మార్చి 31తో పీఎంజీకేవై ముగుస్తుంది. ఆస్తు లు వెల్లడించినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఐటీశాఖ హామీ ఇచ్చింది. ఆదాయాన్ని వెల్లడించని డిఫాల్టర్ల పేర్లను ఈడీ - సీబీఐ వంటి జాతీయ సంస్థలకు తెలియజేస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు.

పెద్దనోట్ల రద్దు తరువాత భారీఎత్తున డబ్బును డిపాజిట్ చేసి, పీఎంజీకేవైని వినియోగించనివారికి భారీగా జరిమానా విధిస్తామని ఐటీ అధికారులు తెలిపారు. డిఫాల్టర్లపై బినామీ లావాదేవీల చట్టం కూడా ప్రయోగిస్తామన్నారు. ఈ పథకం కింద ఆదాయాన్ని వెల్లడించిన వ్యక్తి, లేదా సంస్థ.. డిపాజిట్ చేసిన ఆదాయంలో 49.9 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఈ పథకాన్ని ఉపయోగించుకోకుండా ఇన్‌కంట్యాక్స్‌ రిటర్న్‌ లో ఆదాయాన్ని తెలిపిన వారికి జరిమానాతోపాటు 77.25 శాతం పన్ను విధిస్తామని చెప్పారు. ఆదాయాన్ని వెల్లడించకుండా ఆధారాలులేని డబ్బుతో దొరికిపోయిన వారికి 83.25 శాతం పన్ను విధిస్తామని, అధికారులు తనిఖీలు చేసి ఆధారాలులేని ఆదాయాన్ని కనుగొంటే 107.25 శాతం పన్నుతోపాటు జరిమానా విధిస్తామని తెలిపారు. అధికారుల తనిఖీలలో కూడా ఆదాయాన్ని బహిర్గతం చేయనివారికి జరిమానాతోపాటు 137.25 శాతం పన్ను విధిస్తామని చెప్పారు. ఉల్లంఘనులపై బినామీ చట్టాన్ని ప్రయోగిస్తే వారికి ఏడేండ్ల కఠిన కారాగారశిక్షతోపాటు, ఐటీ చట్టం కింద ఆరోపణలు మోపే అవకాశం కూడా ఉంటుందన్నారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/