Begin typing your search above and press return to search.

ఈ టీడీపీ ఎమ్మెల్యేకు కేసీఆర్‌ పై మ‌ళ్లీ ప్రేమ పుట్టింది

By:  Tupaki Desk   |   12 April 2018 8:03 AM GMT
ఈ టీడీపీ ఎమ్మెల్యేకు కేసీఆర్‌ పై మ‌ళ్లీ ప్రేమ పుట్టింది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు మ‌ళ్లీ ప్రేమ పుట్టింది. గ‌త కొద్దికాలంగా టీఆర్ ఎస్ స‌ర్కారు తీరుపై మండిప‌డుతున్న టీడీపీ నాయ‌కుడు - ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తాజాగా కేసీఆర్‌ పై ప్రేమ చాటారు. రాష్ట్రంలోని బీసీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. ఆయనది గొప్ప మనసని ప్రశంసించారు. మహాత్మా జ్యోతిరావుఫూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. తన ప్రసంగంలో బీసీల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించారు. బీసీల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నారని కొనియాడారు.

``ఎన్నో ఏళ్లుగా.. ఎంతో మంది ముఖ్యమంత్రులను కలిశాను.. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుది ఎంతో గొప్పమనసు.. బీసీల అభివృద్ధికి ఆయన నిరంతరం కృషిచేస్తున్నారు`` అని ఆర్.కృష్ణ‌య్య‌ వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా జ్యోతిబాపూలే పేరిట బీసీ గురుకుల విద్యాలయాలను సమర్థంగా నిర్వహిస్తున్నారన్నారు. గత ఏడాది ఒకేసారి 119 బీసీ గురుకులాలను ఏర్పాటుచేసి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని చెప్పారు. బీసీ కుటుంబాలకు చెందిన అందరు చిన్నారులకు గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యను అందించాలని తాను కోరగా.. మరో 119 బీసీ గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, తన విశాల హృదయాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో జ్యోతిబాపూలే ఆశయాలకు అనుగుణంగా విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆర్‌.కృష్ణ‌య్య‌ కొనియాడారు. గత ముఖ్యమంత్రులెవరూ బీసీ, ఎంబీసీల గురించి, వారి సంక్షేమం, రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ బీసీలకు అండగా నిలువడం హర్షణీయమని అన్నారు. భవిష్యత్ తరాలకు బంగారుబాటలు వేసేందుకు సీఎం కేసీఆర్ బీసీ చిన్నారులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించడం అభినందనీయమని కృష్ణయ్య ప్రశంసించారు. దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లను అమలుపరుచాలని, పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల్లోని రాజకీయ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సమైక్యంగా నినదించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రధాని మోడీతో చర్చించానని చెప్పారు.