Begin typing your search above and press return to search.

వెలంపల్లి దెబ్బకు..పుట్టా దిగిపోయారబ్బా!

By:  Tupaki Desk   |   19 Jun 2019 1:08 PM GMT
వెలంపల్లి దెబ్బకు..పుట్టా దిగిపోయారబ్బా!
X
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్ పదవికి రాజీనామా చేయబోనంటూ మంకుపట్టు పట్టిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. తాను టీడీపీకి చెందిన వాడినే అయినా కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గా ఏపీ ప్రభుత్వం తనను నియమించిందని - తెలుగు దేశం పార్టీ నియమించలేదని తనదైన శైలి వాదనలను వినిపించిన పుట్టా... టీటీడీ బోర్డు చైర్మన్ గిరీని వదులుకునే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వంలో దేవదాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెలంపల్లి శ్రీనివాస్... బుధవారం తిరుమలకు వచ్చారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన వెలంపల్లి... రాష్ట్రంలోని ఆలయాల కమిటీలన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో కొత్త కమిటీలను నియమించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే పుట్టా సుధాకర్ యాదవ్... టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కు పంపారు.

కడప జిల్లా మైదుకూరుకు చెందిన పుట్టా... తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే నేతలు.. ఎలాంటి పదవుల్లో ఉండరాదు. అయితే పుట్టా మాత్రం టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండానే ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై పోటీ చేశారు. అయితే ఆ విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో విక్టరీ సాధించిన తర్వాత పలు ఆలయాల పాలకమండళ్లు స్వచ్ఛందంగానే రాజీనామా చేశాయి. అయితే పుట్టా మాత్రం రాజీనామా చేసేది లేదని తేల్చేశారు. ఏపీ ప్రభుత్వం ద్వారా నియమితుడనైన తాను... ఇంకా రెండేళ్ల పాటు పదవిలో కొనసాగే వీలుందని వాదించారు. దైవ కార్యం కోసం నియమితుడనైన తాను... తనకు తానుగా పదవి నుంచి దిగనని - ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తే ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఆర్డినెన్స్ రాకుండానే... కేవలం ఆర్డినెన్స్ మాట వెలంపల్లి నోట వినిపించగానే... ఏమనుకున్నారో - ఏమో తెలియదు గానీ పుట్టా రాజీనామా చేశారు.