Begin typing your search above and press return to search.

నయీం-శ్రీధర్ బాబు దోస్తీ?

By:  Tupaki Desk   |   25 Oct 2016 7:01 AM GMT
నయీం-శ్రీధర్ బాబు దోస్తీ?
X
ఇటీవల ఎన్ కౌంటర్ కు గురైన గ్యాంగ్ స్టర్ నయీంతో నేతలు - పోలీసుల సంబంధాలపై ఇప్పటికే ఎన్నో సంచలనాలు. తాజాగా కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి ఒకరు నయీం ఎఫైర్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీఆరెస్ ఎమ్మెల్యే ఒకరు ఆయనపై ఈ ఆరోపణలు చేస్తుండడమే కాకుండా కేసీఆర్ కు దీనిపై పక్కా ఆధారాలతో కంప్లయింటు చేయబోతున్నట్లూ ప్రకటించారు.

మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నయీంతో శ్రీధర్ బాబుకు సంబంధాలు ఉన్నాయని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ - డీజీపీ అనురాగ్ శర్మలకు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. శ్రీధర్ బాబు తండ్రి - మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసుతో సంబంధాలు ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు నయీమ్ తో శ్రీధర్ బాబు దోస్తీ చేశారని మధు ఆరోపించారు. ఈ క్రమంలోనే, మాజీ మావోయిస్టు జడల నాగరాజు ఆచూకీ లేకుండా పోయాడని తెలిపారు.

శ్రీధర్ బాబు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన మంథని నియోజకవర్గంలో తొలిసారి మధు గెలిచారు. అంతకుముందు టీడీపీలో ఉన్న మధు టీఆరెస్ లో చేరి శ్రీధర్ బాబుపై గెలుపు సాధించారు. ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఈనాటివి కావు. మాజీ మావోయిస్టు జడల నాగరాజు ఏడాదిన్నరగా ఆచూకీ లేకపోవడంతో ఆయన్ను శ్రీధర్ బాబు నయీం సాయంతో హత్య చేయించారన్న కోణంలో మధు ఆరోపణలు చేస్తున్నారు. కాగా... శ్రీధర్ బాబు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/