Begin typing your search above and press return to search.

సీమ బీజేపీకి పెద్ద‌దిక్కుగా చిన్న‌మ్మ‌!

By:  Tupaki Desk   |   21 Sep 2017 10:06 AM GMT
సీమ బీజేపీకి పెద్ద‌దిక్కుగా చిన్న‌మ్మ‌!
X
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోగా సొంతంగా ఏపీలో ఎదిగేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇన్నాళ్లూ అనుకుం టున్నా. . కొంద‌రు పెద్ద‌లు మోకాల‌డ్డ‌టంతో ఇప్ప‌టివ‌ర‌కూ విస్త‌ర‌ణపై దృష్టిసారించ‌లేదు. అయితే ఇప్పుడు అనుకున్న‌దే త‌డ‌వుగా.. ప‌క్కా వ్యూహంతో అడుగులేస్తోంది ఏపీ బీజేపీ! ముందుగా సీమ జిల్లాల‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టింది. ఇక్క‌డ పార్టీని బ‌లోపేతం చేసే బాధ్య‌త‌ను ఎన్టీఆర్ కూతురు - బీజేపీ నేత ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రికి అన‌ధికారికంగా అప్ప‌గించార‌నే చ‌ర్చ పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో మొద‌లైంది. ముఖ్యంగా ఆమె సీమ‌లో ఇటీవ‌ల ప‌ర్య‌టించ‌డం.. చూసిన వారంతా సీమ బీజేపీకి చిన్న‌మ్మే పెద్ద దిక్కులా మారార‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

ఏపీలో బీజేపీ అభివృద్ధి చెంద‌క‌పోవ‌డానికి ప్రధాన కార‌ణాలు.. రాష్ట్రానికి ఇన్ని ఇస్తున్నామ‌ని స‌రైన ప్ర‌చారం చేయ‌గ‌లిగే నేత లేకపోవ‌డంతోపాటు.. కొంద‌రు బీజేపీ నేత‌లు ఏపీ సీఎంకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం!! ఈ నేప‌థ్యంలో బ‌ల‌హీనంగా ఉన్న కొన్ని ప్రాంతాల‌పై బీజేపీ పెద్ద‌లు ఫోక‌స్ పెట్టారు. రాయలసీమలో తమ పార్టీని బలోపేతం చేయడానికి పురంధేశ్వరిని రంగంలోకి దించారు. ఎన్టీఆర్ కుమార్తెగా - మాజీ ఎంపీగా ఆమెకు ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉంది. విభజన తర్వాత బీజేపీలో చేరిన ఆమె. - రాజంపేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. కొంతకాలం నుంచి స్తబ్దుగా ఉన్న పురంధేశ్వరికి తాజాగా బీజేపీ పెద్దలు కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.

పురంధేశ్వరికి సీమలో పార్టీ నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు కమలం శ్రేణుల్లో చ‌ర్చ మొద‌లైంది. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాలో బీజేపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి నడుం బిగించారట. పార్టీ నుంచి అందిన సూచనల మేరకే పురంధేశ్వరి సీమ‌లో ప‌ర్య‌టిస్తున్నార‌ట‌. టీడీపీతో స్నేహం ఉన్నా.. ఆ పార్టీ నేతలు తమకు తగిన గౌరవం కల్పించడం లేదనే విషయాన్ని జిల్లా నేతలు పురంధేశ్వరి దృష్టికి తీసుకెళ్లారట. నామినేటెడ్ పోస్టులు, ఇతర పదవుల్లో బీజేపీకి ఎటువంటి ప్రాధాన్యం కల్పించడం లేదని వాపోయార‌ట‌. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.