Begin typing your search above and press return to search.

కోర్టులో కేసు వేసి రైలు గెలిచిన రైతు!

By:  Tupaki Desk   |   19 March 2017 5:08 AM GMT
కోర్టులో కేసు వేసి రైలు గెలిచిన రైతు!
X
రైల్వే శాఖపై కేసు వేసిన ఒక రైతు పరిహారంగా ఎక్స్‌ ప్రెస్ రైలును సాధించిన సంగతిది! పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాకు చెందిన రైతు సంపూరణ్‌ సింగ్ తన భూమిని లూథియానా-చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణంలో కోల్పోయారు. చాలా స్వల్ప పరిహారంతో సరిపెట్టారని ఆరోపిస్తూ దానికి తగిన నష్టపరిహారం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. తనకు బకాయి ఉన్న కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ లో ఆయనకు అనుకూలంగా పదేళ్ల‌ క్రితమే తీర్పు వెలువడింది. కోర్టు తీర్పు తర్వాత కూడా ఆయనకు రైల్వేశాఖ పరిహారాన్ని ఇవ్వలేదు. దీంతో ఆయన ఈ ఏడాది జనవరిలో మరోసారి కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు.. రైల్వేశాఖ బకాయి ఉన్న కోటి రూపాయల పరిహారానికిగాను ఆయనకు న్యూఢిల్లీ-అమృత్‌సర్ మధ్య తిరిగే ఎక్స్‌ప్రెస్ రైలును ఇవ్వాలని ఆదేశించింది.

లూథియానాలోని స్టేషన్ మాస్టర్ ఆఫీస్‌ పై యాజమాన్య హక్కులను సంపూరణ్‌ సింగ్‌ కు జడ్జి జస్పాల్‌ వర్మ కేటాయించారు. విచారణ ముగిసిన తర్వాత ఉత్తర్వు పత్రాలను పట్టుకుని తన లాయర్‌ తో కలిసి స్టేషన్‌ కు వెళ్లిన సంపూరణ్‌ సింగ్ తనకు మంజూరు చేసిన రైలు వచ్చేంత వరకు ఎదురుచూసి, రైలు డ్రైవర్‌ కు ఆ పత్రాలను అందజేశాడు. ఉన్నట్టుండి రైలును ఆపివేయడం వల్ల వేలమంది ప్రయాణికులు ఇబ్బందికి గురవుతారనే ఉద్దేశంతో ఆ రైలు వెళ్లాల్సిన చోటుకు వెళ్లేందుకు అంగీకరించానని సంపూరణ్‌ సింగ్ తెలిపారు. ఈ లోపే రైల్వే అధికారులు కోర్టు తీర్పును తదుపరి విచారణ వరకు పక్కనపెట్టేందుకు మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. చెప్పిన గడువులోగా పరిహారం చెల్లించని పక్షంలో 20 కోచ్‌ లు ఉండే ఎక్స్‌ప్రెస్ రైలును వేలం వేసి.. ఆ సొమ్మును రైతుకు అందజేస్తామని జడ్జి స్పష్టంచేశారు. గతంలోనూ ఇలా భూములు కోల్పోయి తగిన పరిహారం అందనివారికి రైళ్లను పరిహారంగా ఇవ్వాలంటూ దేశంలోని పలు కోర్టులు తీర్పులు ఇచ్చాయి. అయితే అవేవీ నిలువలేకపోయాయి. 2006లో దక్షిణ కర్ణాటకలో ఒక రైతు ఇదే పద్ధతుల్లో రైలును పరిహారంగా పొందాడు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/