Begin typing your search above and press return to search.

నీర‌వ్ జారుకునేందుకు...వీళ్లే కార‌ణం

By:  Tupaki Desk   |   21 Jun 2018 4:54 AM GMT
నీర‌వ్ జారుకునేందుకు...వీళ్లే కార‌ణం
X
ఓ సంస్థ స‌ర్వ‌నాశనం అయ్యేందుకు ప్ర‌త్య‌ర్థులు వేసే ఎత్తుగ‌డ‌లే కార‌ణం కాన‌క్క‌ర్లేద‌ని...ఇంటి దొంగ‌ల కార‌ణంగా కూడా అలాంటి ప‌రిస్థితులు చోటుచేసుకుంటాయ‌ని ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే. అలాంటి ఇంటి దొంగ‌ల కార‌ణంగా దేశం అవాక్క‌య్యే కుంభ‌కోణం చోటుచేసుకున్న ఉదంతం తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చింది. అవినీతి.. అసమర్థత.. పర్యవేక్షణ లోపం.. వెరసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ) కుంభకోణం. క్లర్కుల నుంచి ఫారిన్ ఎక్స్‌ చేంజ్ మేనేజర్లదాకా - ఆడిటర్ల నుంచి ప్రాంతీయ కార్యాలయాల అధిపతుల వరకు ఎందరో ఉద్యోగుల అవినీతి - ఆపై ఉన్నతాధికారుల అసమర్థత - పర్యవేక్షణ లోపాల వల్లే దేశ చరిత్రలో ఓ భారీ మోసం జరుగగలిగింది. ఇదంతా మీడియా ఇప్పటిదాకా చెప్పింది మాత్రమేకాదు.. 162 పేజీల పీఎన్‌ బీ అంతర్గత నివేదిక సారాంశం కూడా.

పీఎన్‌ బీ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌ మెంట్ సంస్థకు ఈ ఏడాది ఏప్రిల్ 5న ఆ బ్యాంక్ అధికారులు సమర్పించిన ఈ నివేదికను చూస్తే.. ఏళ్ల‌ తరబడి వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆయన మేనమామ - ఆభరణాలు - రత్నాల వ్యాపారి మెహుల్ చోక్సీల అడుగులకు పీఎన్‌ బీ వర్గాలు ఎలా మడుగులు ఒత్తారో తెలుస్తోంది. ముంబైలోని బ్రాడీహౌజ్ శాఖ కేంద్రంగా ఈ పెను మోసం జరుగగా - నకిలీ లెటర్ ఆఫ్ అండర్‌ టేకింగ్స్ (ఎల్‌ వోయూ) - ఫారిన్ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ (ఎఫ్ ఎల్‌ సీ) ఆధారంగా నీరవ్ - చోక్సీల సంస్థలు విదేశాల్లోని భారతీయ బ్యాంకు శాఖల నుంచి వేల కోట్ల రుణాలు పొందిన సంగతి విదితమే. ఈ ఘరానా మోసంలో బ్రాడీహౌజ్ ఫారెక్స్ డివిజన్‌ లో పనిచేసే గోకుల్‌ నాథ్ శెట్టి ప్రధానమవగా, ఈయన వ్యక్తిగత మెయిల్ నుంచి రాత్రుళ్లు జరిపిన లావాదేవీలే బ్యాంక్ భారీ నష్టాలకు దారితీసిందని సమాచారం. సంప్రదాయ స్విఫ్ట్ వ్యవస్థను వినియోగించకపోవడంతో ఈ మోసం యదేచ్ఛగా సాగింది. మరోవైపు నీరవ్ - చోక్సీల సంస్థల లావాదేవీల కారణంగా పీఎన్‌ బీలోనే బ్రాడీహౌజ్ శాఖ వ్యాపారం ఓ వెలుగు వెలిగిపోవడం కూడా అనుమానాలను కలిగించలేకపోయింది. అధికారులూ ఆడిటింగ్‌ ను గుడ్డిగా చేసినట్లు అంతర్గత విచారణలో తేలింది.

దర్యాప్తు సంస్థలకు అందిన ఈ నివేదికలో 54 మంది ఉద్యోగుల పాత్ర మోసంలో ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. వీరిలో 8 మందిపై ఇప్పటికే కేసులు నమోదవగా, 21 మంది అధికారులను సస్పెండ్ చేసినట్లు బ్యాంక్ సీఈవో సునీల్ మెహతా వెల్లడించిన విషయం తెలిసిందే. దోషులనెవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న ఆయన దీన్ని చిన్న సంక్షోభంగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. సిబ్బంది నిర్లక్ష్యం దశాబ్దాల బ్యాంక్ చరిత్రను మంటగలిపిందన్నది నిజమ‌ని, ఈ విష‌యాన్ని సీఈఓ అంగీక‌రించాల‌ని ప‌లువురు అంటున్నారు. మొత్తానికి పీఎన్‌ బీ మోసం భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థనే కుదిపేయగా, నీరవ్ - చోక్సీలు మాత్రం విదేశాలకు జారుకున్నారు.