Begin typing your search above and press return to search.

పులస... కొత్త సోషల్ స్టేటస్

By:  Tupaki Desk   |   25 July 2016 10:21 AM GMT
పులస... కొత్త సోషల్ స్టేటస్
X
ఆంధ్రప్రదేశ్‌ లోని ఉభయ గోదావరి జిల్లాల్లో పులస ఫీవర్ పెరిగిపోయింది. ఏడాదిలో కేవలం రెండుమూడు నెలలు మాత్రమే లభించే ఈ పులస చేప సీజన్ రావడంతో గోదావరి గట్లు వెంబడి జనాలు తిరుగుతున్నారట... చిన్న చేప దొరికినా చాలు.. లేదంటే చివరకు ఒక్క ముక్క ఎవరైనా వాటాగా ఇచ్చినా చాలు దాంతోనే పులుసు పెట్టుకుంటామంటూ తిరుగుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజి ప్రాంతాలు - బొబ్బర్లంక వంటి ప్రాంతాలు పులస చేప కొనడానికి వెళ్లేవాళ్లతో నిండిపోతున్నాయి. పులసను రుచి కోసం తినే భోజన ప్రియులు కొందరైతే.. సోషల్ స్టేటస్ గా భావించి తినేవారు ఇంకొందరు.

జులై నుంచి సెప్టెంబరు వరు లభించే ఈ అరుదైన చేప అంటే మాంస ప్రియులు లొట్టలేసుకుని తింటారు. మాంసాహారంలో చేపల పులుసుకు ప్రత్యేక స్థానముంటే చేపల పులుసులో ఈ పులస పులుసు వంటకం ఎంతో ప్రత్యేకం. ఏపీలో కేవలం ఉభయ గోదావరి జిల్లాలో అరుదుగా లభించే ఈ సీజనల్ ఫిష్‌ ను ఇప్పుడు రుచి చూసేందుకు రాష్ట్రంలోని మాంసాహారులు ఆ జిల్లాకు బారులు తీరుతున్నారు. గోదావరిలో ఈ చేప వలకు దొరికితే నిధి దొరికినట్లేనని మత్స్యకారులు భావిస్తారు. పులస చేప దొరికితే ఆ రోజు పండగే.

పులస చేప ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ - టాంజీనియా సముద్ర ప్రాంతాల నుంచి వలస వస్తుంది. ఇది గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీదుతూ వస్తుంది. గుడ్లు పెట్టిన అనంతరం అక్టోబర్ లో తిరిగి వెళ్లిపోతుంది. ధవళేశ్వరం బ్యారేజి దిగువున మాత్రమే ఈ పులస చేపలు దొరుకుతాయి. గోదావరి తీపి నీటితో పులస రంగు రుచి మారిపోతుంది. అయితే... ఈ చేప ఇతర ప్రాంతాల్లో కూడా నిత్యం దొరుకుతున్నా గోదావరిలోని పులసకే బాగా డిమాండ్ ఉంటోంది. అరకేజీ కూడా లేని చేపను కూడా 3 నుంచి 4 వేలకు కొంటున్నారు. అదే సమయంలో వెస్టు బెంగాల్ - ఒడిశా నుంచి కూడా మార్కెట్ లోకి పులస వస్తుంది. ఇవి కేజీ 100 నుంచి 150 మాత్రమే ధర ఉంటాయి. కానీ.. గోదావరి పులస రుచికి అవి సరిరావని చెబుతారు. కానీ.. జీవ శాస్త్రవేత్తలు మాత్రం రెండు రకాలు పులసలు ఒకటే అని చెబుతుంటారు. ఈ పులస చేప బంగ్లాదేశ్ లోనూ దొరుకుతుంది. బంగ్లాదేశ్ జాతీయ చేప కూడా పులసే.

ప్రస్తుతం ఈ పులస ఫీవర్ గోదావరి జిల్లాల్లోనే కాకుండా హైదరాబాద్ - విశాఖ - విజయవాడలోనూ తీవ్రంగా ఉంది. ఇది తినడాన్ని సోషల్ స్టేటస్ గా భావించేవారు పులస చేపలను తూర్పుగోదావరి నుంచి తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోన గోదావరి పులసల గొప్పదనం గురించి అతిశయోక్తులు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. పులస చేపను పట్టిన రెండు రోజుల వరకు కూడా ఫ్రిజ్ లో పెట్టకపోయినా అది పాడవదని చెబుతుంటారు. కానీ.. అలా తినడం ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. ఏ చేపయినా చనిపోయిన తరువాత ఎక్కువ సేపు సాధారణ ఉష్ణోగ్రతలో ఉంటే పాడవుతుందని చెబుతున్నారు.