Begin typing your search above and press return to search.

రిజర్వేషన్..ఏ రాష్ట్రంలోనైనా కొత్తగా ఇచ్చారా?

By:  Tupaki Desk   |   2 Aug 2018 11:38 AM GMT
రిజర్వేషన్..ఏ రాష్ట్రంలోనైనా కొత్తగా ఇచ్చారా?
X
ఏపీలో కాపు రిజర్వేషన్లపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయం ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపకపోగా రాజకీయ పార్టీల పిల్లిమొగ్గలనూ బయటపెడుతోంది. అదేసమయంలో కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామని చెప్పే ఉద్యమ నేతల్లో నెలకొన్న అస్పష్టత.. అయోమయం.. ఎటు అడుగు వేయాలో తెలియని పరిస్థితి.. ఎవరు సాయం చేస్తారో - ఎవరు మాయ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి కలిపి కాపు యువతను నాలుగురోడ్ల కూడలిలో నిలబెట్టేస్తున్నాయి.

కొన్నాళ్లుగా చూస్తే దేశమంతా రిజర్వేషన్ ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. గుజరాత్‌ - మహారాష్ట్ర - హర్యానా - రాజస్థాన్‌ లలో రిజర్వేషన్ల ఉద్యమాలు జోరుగా ఉన్నాయి. పలుచోట్ల ఇవి హింసాత్మకంగా మారాయి. ఈ ఉద్యమాల్లో వేలకోట్ల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఎంతోమంది మరణించారు. ప్రతి ఏటా కొన్ని కులాలు కొత్తగా ఈ ఉద్యమాల్లో చేరుతున్నాయి. ఈ దశలో దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అమలుపై చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందని సామాజిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అదేసమయంలో ఆంధ్రప్రదేశ్‌ లో కాపు ఉద్యమం తీవ్రతరమైంది. ఒకానొక దశలో ఇది హింసాత్మకంగా కూడా మారింది. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని పార్టీలు అత్యధిక సంఖ్యాకులైన కాపుల్ని ఆకట్టుకునేందుకు దీన్నో ఎన్నికల హామీగా మార్చేసుకున్నాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు బిసి హోదా కల్పిస్తామంటూ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కాగా అంతకుముందే కాంగ్రెస్ కూడా ఇదే హామీనిచ్చారు. ఇప్పుడు ఈ హామీపైనే వైకాపా అధినేత జగన్‌ చేసిన వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరిస్తోంది.

రాజస్థాన్‌ లో గుజ్జర్లు..

కాగా రిజర్వేషన్ల పోరాటాలు ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో తీవ్రంగా ఉన్నాయి. రిజర్వేషన్ల కోసం రాజస్థాన్‌ లోని గుజ్జర్లు 2008నుంచి ఆందోళన చేస్తున్నారు. 2015మేలో అయితే పదిరోజులు నిరవధిక సమ్మెను నిర్వహించారు. రైళ్ళ రవాణాను కూడా స్థంభింపజేశారు. జాతీయ రహదార్లను మూసేశారు. ప్రభుత్వ - ప్రైవేటు సంస్థలన్నీ మూతబడ్డాయి.

హర్యానాలో జాట్స్

హర్యానాలో రిజర్వేషన్ల కోసం జాట్లు చేసిన ఉద్యమం కారణంగా 35వేల కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసానికి గురయ్యాయి. హర్యానాతో పాటు ఢిల్లి - రాజస్థాన్‌ లలో కూడా జాట్లు రిజర్వేషన్‌ ఉద్యమం నిర్వహించారు. 2014లో యుపిఎ జాట్లకు ఒబిసి హోదా కల్పించింది. అయితే సుప్రింకోర్టు దీన్ని కొట్టేసింది.అప్పట్నుంచి తిరిగి జాట్లు ఉద్యమం చేస్తూనే ఉన్నారు.

గుజరాత్‌ లో పటేదార్లు

గుజరాత్‌ లో పటేదార్లు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. 2015జూలైలో పదిలక్షల మందితో వీరు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పోలీస్‌ కాల్పుల్లో 11మంది చనిపోయారు.

మహారాష్ట్రలో మరాఠాలు

మహరాష్ట్రలో మరాఠాలు ముంబయ్‌ మహానగరాన్నే ముంచెత్తారు. ఈ వివాదంలో ముంబయ్‌ హైకోర్టు కూడా స్పందించింది. మరాఠాలకు రిజర్వేషన్‌ లకు సంబంధించి అన్ని పార్టీలు తమ అభిప్రాయాల్ని న్యాయస్థానానికి వెల్లడించాలంటూ ఆదేశించింది.

కాగా 50శాతానికి మించి రిజర్వేషన్ల కల్పనకు వీల్లేదంటూ సుప్రింకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందే కొన్ని రాష్ట్రాలు 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో వాటిని ఈ ఆదేశాల్నుంచి మినహా యించింది.