Begin typing your search above and press return to search.

లండన్ లో ప్రతిధ్వనించిన పుల్వామా దాడి ఘటన

By:  Tupaki Desk   |   18 Feb 2019 11:02 AM GMT
లండన్ లో ప్రతిధ్వనించిన పుల్వామా దాడి ఘటన
X
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేసి 43మందిని హతమార్చడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, సానుభూతి ర్యాలీలు కొనసాగుతున్నాయి. ప్రజలు కొవ్వొత్తులతో ర్యాలీలు తీస్తూ జవాన్లకు నివాళులర్పిస్తున్నారు. జవాన్ల మరణాన్ని దేశంలోనే కాదు విదేశాల్లోని భారతీయులు కూడా తట్టుకోలేక నిరసనలు కొనసాగిస్తున్నారు.

తాజాగా లండన్ లో తెలుగు కుటుంబాలన్నీ కలిసి అక్కడి పాకిస్తాన్ హైకమిషన్ ముందు భారతీయులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. అంతకుముందు లండన్ లోని బెల్ గ్రావియా నుంచి ర్యాలీ తీసి తమ నిరసన తెలిపాయి. ‘శాంతి కోసం ర్యాలీ’, ‘టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ’ - ‘భారత జవాన్లకు నివాళి’ - ‘పాకిస్తాన్ డౌన్ డౌన్’ అంటూ రాసి ఉన్న ఫ్లకార్డులతో ఈ ఆందోళనలో భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలన్ని పాకిస్తాన్ టెర్రరిజానికి వ్యతిరేకంగా భారతదేశానికి మద్దతుగా నిలవాలని నినాదాలు చేశారు.

లండన్ లోని ఓ ప్రఖ్యాత కంపెనీలో పనిచేసే తెలంగాణకు చెందిన కుర్మాచలం అనే వ్యక్తి ఈ ర్యాలీ చురుగ్గా పాల్గొని నాయకత్వం వహించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పాకిస్తాన్ లో తీవ్ర వాదం మూలాలను తగ్గించడమే మా ఉద్దేశం.. శాంతికోసమే తాము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం’ అని పేర్కొన్నాడు.

ఈ ఉద్యమంతో లండన్ వీధుల్లో వందేమాతరం గేయం ప్రతిధ్వనించింది. బ్రిటీష్ రాజధాని మొత్తం భారతీయ జెండాలతో కనువిందు చేసింది. రాత్రి భారతీయులందరూ మొబైల్ ఫోన్లను ఆన్ చేసి ఆ వెలుతురులో జవాన్లకు నివాళులర్పించడం విశేషం.