Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ ను చొక్కా అడిగిన కోర్టు!

By:  Tupaki Desk   |   18 Nov 2018 6:55 AM GMT
జ‌గ‌న్‌ ను చొక్కా అడిగిన కోర్టు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌ పై విశాఖ విమానాశ్ర‌యంలో గ‌త నెల్లో జ‌రిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. అధికార‌ - ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి తెర‌లేపింది. త‌న‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌పై తాజాగా స్పందించిన జ‌గ‌న్‌.. దాడి వెనుక ప్ర‌భుత్వ హ‌స్త‌ముంద‌ని ఆరోపించారు. దీంతో ప‌రిస్థితులు మ‌రింత వేడెక్కాయి.

ఈ నేప‌థ్యంలో విశాఖ 7వ అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు జ‌గ‌న్‌ పై దాడి కేసులో జారీ చేసిన ఆదేశాలు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. దాడి జ‌రిగిన స‌మ‌యంలో జ‌గ‌న్ వేసుకున్న చొక్కాను త‌మ‌కు స‌మ‌ర్పించాల‌ని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్) అధికారుల‌ను కోర్టు ఆదేశించింది. అందుకు ఆరు రోజులు గ‌డువిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

విమానాశ్ర‌యంలో దాడి జ‌రిగిన‌ప్పుడు జ‌గ‌న్ చొక్కా చిరిగింది. దానికి బాగా ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌య్యాయి. దీంతో ఆ చొక్కాను వీఐపీ లాంజ్‌లోనే జ‌గ‌న్ మార్చుకున్నారు. మ‌రో చొక్కా ధ‌రించారు. అక్క‌డే ప్రాథ‌మిక చికిత్స చేయించుకున్నారు. అనంత‌రం విమానంలో హైద‌రాబాద్ వెళ్లి ఆస్ప‌త్రిలో చేరారు. గాయం తీవ్ర‌త‌ - దాడికి వినియోగించిన ఆయుధానికి సంబంధించి ప్ర‌స్తుతం ప‌లు అనుమానాలు రేకెత్తుతున్న నేప‌థ్యంలో.. నాడు జ‌గ‌న్ ధ‌రించిన చొక్కానే నేడు ఈ కేసులో కీలక ఆధారంగా మారింది.

జ‌గ‌న్‌ పై దాడి కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సిట్ బృందానికి నేతృత్వం వ‌హిస్తున్న విశాఖ ఏసీపీ బీవీఎస్‌ నాగేశ్వరరావు తాజాగా కోర్టు ఆదేశాల‌పై స్పందించారు. జ‌గ‌న్ స్వ‌యంగా కోర్టుకు వ‌చ్చి చొక్కాను అంద‌జేయాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త స‌హాయ‌కులు ఎవ‌రైనా స‌రే వ‌చ్చిఈ నెల 23వ తేదీలోగా అందించ‌వ‌చ్చున‌ని వెల్ల‌డించారు.