Begin typing your search above and press return to search.

ఎల్‌కేజీ పాప‌ను ఆ స్కూలు ఏం చేసిందంటే..?

By:  Tupaki Desk   |   13 Oct 2015 9:33 AM GMT


ఎల్‌ కేజీ చదివే చిన్నారికి ఏం తెలుస్తాయి? ముద్దు..ముద్దుగా మాట్లాడుతూ.. కొత్త విష‌యాలు తెలుసుకుంటూ.. త‌న‌కు తోచిన ప‌నుల్ని తోచిన‌ట్లు చేసేస్తుంది. అలాంటి చిన్నారికి దారుణ‌మైన శిక్ష‌ను విధించిందో స్కూలు యాజ‌మాన్యం. స‌ద‌రు టీచ‌ర్లు చేసిన ప‌ని గురించి విన్న వారు ఎవ‌రైనా షాక్‌ తిన‌టం ఖాయం.

ఏపీలోని ఏలూరులో ఒక ప్రైవేటు స్కూల్లో జ్వాల‌శ్రీ అనే చిన్నారి ఎల్‌ కేజీ చ‌దువుతోంది. తెలిసో.. తెలియ‌కో ఆ చిన్నారి స్కూల్‌ క్లాస్ రూంలో మూత్ర విస‌ర్జ‌న చేసింది. అంతే.. స్కూలు యాజ‌మాన్యానికి విప‌రీత‌మైన కోపం వ‌చ్చేసింది. వెంట‌నే చిన్నారి ఒంటి మీదున్న బ‌ట్ట‌లు తీసేసి.. మ‌ల‌మ‌ల‌మాడే ఎండ‌లో జారుడు బండ మీద కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చేశారు.

గుక్క‌పెట్టి ఏడుస్తున్న చిన్నారిని చూసినా స్కూలు వారి మ‌న‌సు క‌ర‌గ‌లేదు. స్కూలు వారిచ్చిన ప‌నిష్మెంట్ కు ఆ పాప శ‌రీరం క‌మిలిపోవ‌ట‌మే కాదు.. కొంత ఊడి వ‌చ్చింది కూడా. ఈ విష‌యం తెలిసిన చిన్నారి త‌ల్లిదండ్రులు ప‌రుగుప‌రుగున స్కూలుకు వ‌చ్చి చిన్నారిని చూసి బావుర‌మ‌న్నారు. స్కూలు యాజ‌మాన్యం తీరును ప్ర‌శ్నిస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. పాప‌ను తీవ్రంగా గాయ‌ప‌ర్చిన స్కూల్ యాజ‌మాన్యంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఈ విష‌యం మీడియాలో రావ‌టంతో ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు రియాక్ట్ అయ్యారు. పాప‌కు విధించిన శిక్ష గురించి తెలుసుకున్న ఆయ‌న సీరియ‌స్ అయ్యారు. వెంట‌నే స్కూల్ ను మూయించాల్సిందిగా జిల్లా అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌ కేజీ చ‌దివే చిన్నారికి ఇంత దారుణ‌మైన శిక్ష విధించాల‌న్న ఆలోచ‌న వచ్చిన వారిపై కూడా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.