Begin typing your search above and press return to search.

బాబూ.. 2019 వరకు గడువు ఇవ్వండి

By:  Tupaki Desk   |   8 Oct 2015 1:48 PM GMT
బాబూ.. 2019 వరకు గడువు ఇవ్వండి
X
స్థానికత విషయంలో గడువును మరో రెండేళ్లు పెంచాలనే డిమాండ్లు ప్రైవేటు ఉద్యోగుల నుంచి వస్తున్నాయి. స్థానికతకు సంబంధించిన నిర్వచనాన్ని నవ్యాంధ్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2017 మార్చి 31వ తేదీలోపు వచ్చిన వారినే స్థానికులుగా గుర్తిస్తామని తేల్చి చెబుతోంది. ఆ గడువులోపులో పంజాబు వాళ్లు వచ్చినా.. బీహారు వాల్లు వచ్చినా.. తెలంగాణ వాళ్లు వచ్చినా.. సీమాంధ్ర వాళ్లు వచ్చినా.. అందరికీ స్థానికత కల్పిస్తామని స్పష్టం చేస్తోంది.

ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు ప్రభుత్వం స్థానికత విషయంలో కాస్త ఉదారంగానే వ్యవహరించిందని చెప్పవచ్చు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ స్థానికత కల్పిస్తామని స్పష్టం చేస్తోంది. అయితే, కేవలం గడువు విషయంలోనే ప్రభుత్వం నుంచి ఆ ఉదారత కనిపించడం లేదనే వాదన వ్యక్తమవుతోంది.

కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు. చదువు మధ్యలో ఉన్నవాళ్లు ఉన్నారు. 2017, 18 సంవత్సరాల్లో పిల్లలు తొమ్మిది పది తరగతులకు వచ్చిన వాళ్లు, ఇంటర్ మొదటి సంవత్సరానికి వచ్చిన వాళ్లు ఉన్నారు. ఇటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వాళ్లు నవ్యాంధ్రకు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వెళ్లిపోవాలనే ఆశతో ఉన్నారు. కానీ, వారు పని చేసే కంపెనీలు ఇప్పటికిప్పుడు తమ తమ కంపెనీలను నవ్యాంధ్రకు తరలించే పరిస్థితులు లేవు. అక్కడ రాజధానికి ఒక రూపు వచ్చిన తర్వాత, పరిశ్రమలను, కంపెనీలను ఎక్కడెక్కడ పెట్టుకోవాలో నిర్ణయించుకుని కంపెనీలను పెట్టనున్నాయి. ఆ తర్వాతే తమ ఉద్యోగులను తరలించనున్నాయి. ఇదంతా జరగడానికి మరో మూడు నాలుగేళ్లు పడుతుందని అంటున్నారు. మరోపక్క, ఉమ్మడి రాష్ట్రంగా గడువు పదేళ్లు ఉంది. 2019 నాటికి ఐదేళ్లు పూర్తవుతుంది. కనీసం అప్పటి వరకు అయినా స్థానికత విషయాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు, ప్రభుత్వం అనివార్య పరిస్థితుల్లో వెళ్లిపోవాల్సి వచ్చినా.. అటువంటివి కాకపోయినా వివిధ రకాల అనివార్యతలు ప్రజలకు కూడా ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.