Begin typing your search above and press return to search.

రాష్ర్టపతి ఎన్నికల్లో ఏపీ నుంచి ఎవరికెన్ని ఓట్లు?

By:  Tupaki Desk   |   17 July 2017 6:23 AM GMT
రాష్ర్టపతి ఎన్నికల్లో ఏపీ నుంచి ఎవరికెన్ని ఓట్లు?
X
రాష్ర్టపతి ఎన్నికలలో ఏపీలో పాలక పక్షం - విపక్షం కూడా ఒకే విధానం అనుసరిస్తుండడంతో దాదాపుగా ఇక్కడి ఓట్లన్నీ ఒకే అభ్యర్థికి పడనున్నాయి. ఏపీలో కేవలం రెండే పార్టీల నుంచి ప్రతినిధులు ఉండడంతో ఓట్లన్నీ ఒక్కరికే పడనున్నాయి. ఎన్డీయే అభ్యర్థి అయిన రామ్ నాథ్ కోవింద్ కే పాలక టీడీపీ - విపక్ష వైసీపీ మద్దతు ఇస్తుండడంతో ఏపీ ఓట్లన్నీ ఆయనకే చెందనున్నాయి. అయితే.. గతంలో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు నలుగురు ఉన్నారు. వారు మాత్రమే మీరా కుమార్ కు ఓటేయనున్నారు.

ఏపీ నుంచి మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు - 36 మంది ఎంపీలు ఉన్నారు. నిజానికి ఏపీ నుంచి 175 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో ఒకరు తక్కువయ్యారు. 36 మంది ఎంపీల్లో నలుగురు కాంగ్రెస్ వారు కాగా మిగతావారంతా టీడీపీ - వైసీపీ నేతలే. ఎమ్మెల్యేలంతా టీడీపీ వైసీపీ వారే. దీంతో నలుగురు ఎంపీలు మినహా మిగతావారంతా రామ్ నాథ్ కే ఓటేయనున్నారు.

ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159 పాయింట్లు, ఎంపి ఓటు విలువ 708 పాయింట్లుగా ఈసీ తెలిపింది. ఈ లెక్కన ఏపీ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఎన్డీఏ అభ్యర్థి రామ్‌ నాథ్‌ కు 50,322 ఓట్లు వస్తాయి. ఇందులో ఎంపీల నుంచి 22656 - ఎమ్మెల్యేల నుంచి 27,666 ఎలక్ట్రోల్‌ ఓట్లు వస్తాయని, అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థి మీరాకుమార్‌ కు నలుగురు ఎంపీల ఓట్లతో 2,832 ఓట్లు వస్తాయి. ఇదంతా సభ్యులంతా ఓటేసినప్పుడు... అది కూడా వారివారి పార్టీల విధానాల ప్రకారం వేసినప్పుడు మాత్రమే ఈ లెక్క సరిపోతుంది.