Begin typing your search above and press return to search.

గంటాను ప‌త్తిపాటి అడ్డంగా బుక్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   21 March 2017 6:38 AM GMT
గంటాను ప‌త్తిపాటి అడ్డంగా బుక్ చేస్తున్నారా?
X
ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం ఒక‌టి చోటు చేసుకుంది. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ మూడు చోట్ల విజ‌యం సాధించ‌టం తెలిసిందే. వీటిల్లో జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోనూ ఓట‌మి గురి కావ‌టం ఏపీ అధికార‌ప‌క్షంలో ఆనందం వెల్లివిరిస్తోంది. భారీ ఎత్తున సాగిన ప్ర‌లోభాల ప‌ర్వంలో భాగంగా క‌డ‌ప ఎమ్మెల్సీ సీటును టీడీపీ సొంతం చేసుకుంద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. దీనికి త‌గ్గ‌ట్లే.. అధికార టీడీపీ దాదాపు రూ.125కోట్ల‌ను ఈ ఒక్క సీటును గెలుచుకోవ‌టానికి ఖ‌ర్చు చేసింద‌న్న అభిప్రాయం క‌డ‌ప జిల్లాలో ప‌లువురి నోట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. క‌డ‌ప విజ‌యంలో మంత్రి గంటా శ్రీనివాస‌రావు పాత్ర ఎంతో ఉంద‌ని.. 2019లో గంటాను పులివెందుల బ‌రిలో నిల‌బెడ‌తామంటూ మ‌రో మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఈ సంభాష‌ణ ఇలా సాగుతున్న వేళ‌లో.. అటువైపుగా వ‌చ్చిన మాజీ మంత్రి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ క‌ల్పించుకుంటూ.. ఏంటి? గ‌ంటాను పులివెందుల‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోటీకి నిల‌బెడ‌దామ‌నుకుంటున్నారా? ఈ మాట నాకెంతో ఆశ్చ‌ర్యంగా ఉంది.. గంటా రాజ‌కీయాల్లో ఉండ‌టం ప‌త్తిపాటికి ఇష్టం లేదా? అంటూ వ్యాఖ్యానించ‌టంతో ప‌త్తిపాటి కంగుతిన్న పరిస్థితి.

పులివెందుల బ‌రిలో దిగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్‌. పులివెందుల‌లో వైఎస్ కుటుంబానికి త‌ప్ప అక్క‌డి ప్ర‌జ‌లు మ‌రెవ‌రికీ ఓటు వేయ‌ని ప‌రిస్థితి. అలాంటి చోట మంత్రి గంటా పోటీ చేస్తార‌ని మ‌రో మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించ‌టం అంటే.. గంటాను బుక్ చేయ‌ట‌మేన‌న్న మాట ప‌లువురి నోట వినిపించ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/