Begin typing your search above and press return to search.

లోకేష్‌ కు నార్కో టెస్ట్‌..త‌ప్పైతే దేశం విడిచిపోతా

By:  Tupaki Desk   |   23 March 2018 7:03 PM GMT
లోకేష్‌ కు నార్కో టెస్ట్‌..త‌ప్పైతే దేశం విడిచిపోతా
X
సినీనటుడు పోసాని కృష్ణమురళి మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడైన మంత్రి లోకేష్‌పై విరుచుకుప‌డ్డారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీ డబుల్ స్టాండర్డ్స్‌తో వ్య‌వ‌హరిస్తోంద‌ని ఆరోపించారు. సినీ ప‌రిశ్ర‌మ‌ను టార్గెట్ చేయ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రత్యేకహోదాపై ఎందుకు చంద్ర‌బాబు మాట మార్చారని కృష్ణ‌ముర‌ళి సూటిగా ప్రశ్నించారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న ప్యాకేజీకి ఒప్పుకుని ప్రస్తుతం బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగనందునే చంద్రబాబు మాట మార్చారని పోసాని తెలిపారు. ఆ స‌మ‌యంలో హోదా అంటే అణిచివేసేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేశార‌న్నారు. ప్రత్యేక హోదా కోసం చలసాని శ్రీనివాస్ రోడ్డుమీదకు వచ్చి ధర్నా చేస్తుంటే ఆయన చొక్కాను పోలీసులు చింపేశారని, అలాంటప్పుడు హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఇలా క‌ఠినంగా అణిచివేసిన చంద్ర‌బాబు ఇప్పుడు హోదా గురించి మాట్లాడ‌టం ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి లోకేష్‌ పై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతీపనిలో లోకేష్‌ తో పాటు టీడీపీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. కావాలంటే నారా లోకేష్‌ కి నార్కో అనాలిసిస్ టెస్టు చేయించండి. అది అబద్ధమైతే లోకేష్ కాళ్ళు మొక్కి ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోతానని సంచ‌ల‌న స‌వాల్ చేశారు.