Begin typing your search above and press return to search.

నారా లోకేష్ పై విరుచుకుపడ్డ పోసాని

By:  Tupaki Desk   |   21 Nov 2017 10:03 AM GMT
నారా లోకేష్ పై విరుచుకుపడ్డ పోసాని
X
గ‌త వారం ఏపీ స‌ర్కారు ప్ర‌క‌టించిన నంది అవార్డుల‌పై రేగిన వివాదం ఇప్పుడ‌ప్పుడే స‌ద్దుమ‌ణిగేలా లేదు. ఒకే ద‌ఫా మూడేళ్ల‌కు సంబంధించిన అవార్డుల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం... ఈ గోల‌కు నాందీ ప‌లికింద‌న్న వాద‌న వినిపిస్తోంది. అస‌లు ఏ ఏడాదికి ఆ ఏడాది అవార్డుల‌ను విడుద‌ల చేస్తూ పోతుంటే అస‌లు ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చేవి కాద‌న్న వాద‌న కూడా లేకపోలేదు. మూడేళ్ల అవార్డుల‌న్నీ కూడా ఒకే కులానికి చెందిన వారికి ఇచ్చారంటూ సినిమా ఫీల్డ్‌ లోని మ‌రో వ‌ర్గం రోడ్డెక్కగా ... ఇంకో వ‌ర్గం కాస్తంత సైలెంట్ గా ఉన్నా సుతిమెత్త‌గానే కామెంట్లు సంధిస్తోంది. ఇక మీడియా రెండు వ‌ర్గాల‌ను ఎదురెదురుగా కూర్చోబెట్టి వివాదాన్ని పెంచి పెద్ద‌ది చేసేసింది. అయినా ఈ వివాదంలో కాలు పెడితే ఏమ‌వుతుందోన‌న్న భ‌యంతో సినీ ఫీల్డ్‌ కు చెందిన పెద్ద త‌ల‌కాయ‌లే మిన్న‌కుండిపోయాయి. అయితే ఏమాత్రం అవ‌స‌రం లేక‌పోయినా... నిన్న టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కంటే ముందు ఆయ‌న కుమారుడు - మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ఈ వివాదంపై త‌మ‌దైన రీతిలో స్పందించేశారు.

అసలు వీరిద్దరూ స్పందించ‌కున్నా అడిగే నాథుడు లేడ‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. అయితే ఏ ఒక్క‌రు అడ‌గ‌కున్నా, అవ‌స‌రం లేక‌పోయినా కూడా వీరిద్ద‌రూ స్పందించి... ఈ వివాదానికి మ‌రింత‌గా ఆజ్యం పోశార‌ని చెప్పాలి. ఏపీలో ఆధార్ కార్డులు - ఓటు హ‌క్కు లేని వారా మాట్లాడేది అంటూ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్య‌లు నిజంగానే సినిమా జ‌నానికి కాలేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నిన్న లోకేశ్ నుంచి వెలువ‌డిన ఈ వ్యాఖ్య‌లపై టాలీవుడ్‌లో అన్ని రంగాల‌పై ప‌ట్టుండి... ఫైర్ బ్రాండ్‌గా ఎదిగిన పోసాని కృష్ణ ముర‌ళి కాసేప‌టి క్రితం విరుచుకుప‌డ్డారు. లోకేశ్ నోట నుంచి వ‌చ్చిన ఒక్కో మాట‌ను ప్ర‌స్తావించిన పోసాని... మొత్తంగా క‌డిగిపారేశార‌నే చెప్పాలి. అయినా పోసాని ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... ఏపీలో ఆధార్ కార్డులు లేని తాము ఎన్నారైలు అయితే... లోకేశ్‌ ఎవరని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ తిట్టలేదని.. కేవ‌లం ఏపీ రాజకీయ నేతలను మాత్రమే తిట్టారని అన్నారు.

లోకేశ్ కు ఉన్న మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే... త‌మ‌ను తరిమికొట్టేవారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నామని పోసాని తెలిపారు. నారా లోకేశ్ మంత్రి కావడం తమ ఖర్మ అని కూడా ఆయ‌న ఓ భారీ సెటైర్ వేశారు. లోకేశ్ ముఖ్యమంత్రి అయితే... తాము తెలుగు రోహింగ్యాలమవుతామని చెప్పారు. తెలంగాణలో పన్నులు కడుతున్నందుకు... తాము ఏపీ గురించి మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో నారా ఫ్యామిలీకి ఇళ్లు, వ్యాపారాలు లేవా? అని అడిగారు. ఒకటి రెండు విమర్శలు చేసినంత మాత్రాన అవార్డులను ఎత్తేస్తారా? అని అన్నారు.చివ‌రగా చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా స్పందించిన పోసాని... బాబుపైనా ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. తనకు ప్రకటించిన నంది అవార్డును తిరస్కరిస్తున్నానని... ఐవీఆర్ ఎస్ ద్వారా నంది అవార్డులు ఇస్తే - అప్పుడు తీసుకుంటానని చెప్పారు. నంది అవార్డులను రద్దు చేయాలని - ఐవీఆర్ ఎస్ ద్వారా మళ్లీ ఎంపిక చేయాలని కూడా పోసాని డిమాండ్ చేశారు,